ప్రభాస్ చెప్పకనే చెప్పేశాడు

ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రభాస్ ఒకవైపు.. మిగతా స్టార్లంతా ఒక వైపు అన్నట్లే ఉంది వ్యవహారం. అతడి సినిమాల లైనప్, సెట్ చేస్తున్న కాంబినేషన్లు, అతడి సినిమాల భారీతనం, వాటి బడ్జెట్లు అన్నీ కూడా ఒక రేంజిలో ఉంటున్నాయి. ఇప్పుడు రాబోతున్న ‘రాధేశ్యామ్’ కంటే కూడా ఆ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాల స్థాయి చాలా ఎక్కువ. వాటికున్న హైప్ కూడా మామూలుగా లేదు.

ఆ చిత్రాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’తో సంచలనం రేపిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటం.. ఇది అతడి మార్కు ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు సరితూగే చిత్రంలా ఇది కనిపిస్తుండటంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. కాగా ఈ సినిమా గురించి ఇటీవల ఒక ప్రచారం గట్టిగా నడిచింది.

‘కేజీఎఫ్’ తరహాలోనే ‘సలార్’ను కూడా ప్రశాంత్ రెండు భాగాలుగా చేస్తున్నాడన్నదే ఆ ప్రచారం.దీని గురించి ఇప్పటిదాకా చిత్ర బృందం నోరు విప్పలేదు. ఈ ప్రచారాన్ని ఖండించలేదు. అలాగని ఔననీ అనలేదు. ఐతే ఇప్పుడు ‘రాధేశ్యామ్’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన ప్రభాస్‌కు దీని గురించి ప్రశ్న ఎదురు కాగా.. సమాధానం ఇవ్వకుండా అందరినీ అయోమయంలో పడేశాడు.

‘సలార్’ రెండు భాగాలా అని ప్రభాస్‌ను అడిగితే.. ‘‘అది ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ గురించి మాట్లాడుకుందాం’’ అనేశాడు. మళ్లీ రెట్టించి అదే ప్రశ్న అడిగితే.. ‘‘ఇంకోసారి ప్రత్యేకంగా దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం’’ అని సమాధానం దాటవేశాడు ప్రభాస్. ఒకవేళ ‘సలార్’ ఒక పార్ట్‌గానే తెరకెక్కుతుంటే.. రెండు భాగాలుగా తీయట్లేదని ఒక్క ముక్కలో తేల్చేసేవాడు ప్రభాస్. ఆ మాట అనకుండా తర్వాత మాట్లాడదాం అన్నాడంటే ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారం నిజమే అనుకోవాలి. ఈ విషయాన్ని అఫీషియల్‌గా, గ్రాండ్‌గా ప్రకటించడం కోసమే ప్రభాస్ ఇప్పుడు సమాధానం దాటవేశాడేమో.