హహా హాసిని.. రీఎంట్రీలో ఏం చేయబోతోంది?

జెనీలియా డిసౌజా.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని కథానాయిక. డబ్బింగ్ సినిమా ‘బాయ్స్’ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముంబయి భామ.. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోకి దూసుకెళ్లిపోయింది. ఈ సినిమాలో హాసిని పాత్ర చూసి ఫిదా అయిపోయి.. ఇలాంటమ్మాయే తమ జీవిత భాగస్వామిగా కావాలని కోరుకున్న అబ్బాయిలు ఎంతమందో.

దీంతో పాటు సత్యం, రెడీ, సై, సాంబ, సుభాష్ చంద్రబోస్, నా అల్లుడు, హ్యాపి, ఆరెంజ్ లాంటి పేరున్న చిత్రాల్లో నటించి ఒక సమయంలో టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది ఈ భామ. ఐతే రానా సరసన చేసిన ‘నా ఇష్టం’ తర్వాత జెనీలియా తెలుగు తెరపై కనిపించలేదు. తర్వాత హిందీలో ఒకటీ అరా సినిమాలు చేసి.. తన తొలి చిత్ర కథానాయకుడు రితీశ్ దేశ్ ముఖ్‌ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయింది.

ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన జెనీలియా.. ఈ మధ్య మళ్లీ పూర్వపు అందం సంతరించుకునేందుకు బాగా కష్టపడుతోంది. వర్కవుట్లవీ చేసి మంచి షేప్‌లోకి వచ్చిన జెన్నీ.. హిందీలో ‘ఇట్స్ మై లైఫ్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమెది పూర్తి స్థాయి పాత్ర కాదు. ఆ సినిమా అంతగా ఆడలేదు కూడా. మళ్లీ గ్యాప్ తీసుకున్న జన్నీ.. హిందీలో, మరాఠీలో ఒక్కో సినిమాలో నటిస్తోంది. ఈలోపు ఆమెకు తెలుగులో చాలా కాలానికి ఒక ఛాన్స్ రావడం విశేషం. దాదాపు దశాబ్దం తర్వాత ఆమె తెలుగు సినిమాలో నటించనుంది.

ఈ చిత్రంతో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి తనయుడు కిరీటి కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. వారాహి చలనచిత్రం బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘పెళ్ళి సందడి’ ఫేమ్ శ్రీలీల హీరోయిన్. జెనీలియా ఇందులో ప్రత్యేక, కీలక పాత్ర చేస్తోంది. ఆమె పాత్ర ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. కానీ హీరోయిన్‌కు దీటుగా ఆ క్యారెక్టర్ కీలకంగా ఉంటుందని, అందుకే ఏరి కోరి ఈ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వడానికి జెన్నీ రెడీ అయిందని అంటున్నారు. ఈ చిత్రంతో రాధాకృష్ణ అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.