దీపావళికి `ఆదిపురుష్‌`.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన‌ నిర్మాత‌!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో `ఆదిపురుష్‌` ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టి. సిరీస్ బ్యాన‌ర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రశాంత్ సుతార్ క‌లిసి రూ. 400 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సాచేత్‌ తాండన్‌, పరంపరా ఠాకూర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్ర‌భాస్ రాఘవుడుగా,  కృతి సనన్ జానకిగా మ‌రియు సైఫ్ అలీ ఖాన్ లంకేషుడిగా క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ప‌నుల‌ను జ‌రుపుకుంటోంది. ఈ భారీ బ‌డ్జెట్ సినిమాను 2022 ఆగస్టు 11న విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌క‌టించారు.

కానీ, ఆమిర్ ఖాన్ న‌టించిన `లాల్ సింగ్ చద్దా` సినిమా కోసం ఆదిపురుష్‌ను వాయిదా వేశారు. అయితే దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్నార‌ని ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర నిర్మాత భూషన్‌ కుమార్ ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆదిపురుష్ విడుద‌ల్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

భూజ‌న్ కుమార్ మాట్లాడుతూ.. `ఆదిపురుష్` దీపావ‌ళికి విడుద‌ల అవుతుంది అన్న ప్ర‌చారంలో ఏ మాత్రం నిజం లేదు. అస‌లు సినిమా రిలీజ్‌పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంటూ స్ప‌ష్టం చేశారు. దీంతో ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలంటూ ప్రభాస్ అభిమానులు కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మ‌రి ఆదిపురుష్ ఏ ఏడాది చివ‌ర్లో అయినా వ‌స్తుందా..? లేక‌ వ‌చ్చే ఏడాదికి షిఫ్ట్ అవుతుందా..? అన్న‌ది చూడాలి.