ప్రభాస్‌పై అమితాబ్ కంప్లైంట్

ప్రభాస్ మీద చాలామంది కో ఆర్టిస్టులకు ఒక పెద్ద కంప్లైంట్ ఉంది. అతను ఫుడ్డు పెట్టి చంపేస్తాడన్నదే ఆ కంప్లైంట్. అతడితో పని చేసిన చాలామంది.. ప్రభాస్ పెట్టే విందు భోజనాల గురించి చాలా చెప్పారు. వేరే భాష నుంచి ఎవరైనా పేరున్న ఆర్టిస్టు ప్రభాస్ సినిమాలో తొలిసారి పని చేస్తే వాళ్లు ఇక చాలు బాబోయ్ అనేట్లు రకరకాల వెరైటీలతో విందు భోజనం పెట్టించి వాళ్లను చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాడట ప్రభాస్. ప్రభాస్ ఆతిథ్యం గురించి ఇప్పటికే చాలామంది చాలా చెప్పారు.

‘రాధేశ్యామ్’లో ప్రభాస్ తల్లిగా నటించిన బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కూడా ప్రభాస్ గురించి ఇదే కంప్లైంట్ చెప్పింది. ఇప్పుడు ఈ జాబితాలోకి బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా చేరిపోయారు. ఆయన కూడా ప్రభాస్ పెట్టే తిండి మీద ఫిర్యాదు చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ కే’ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ ఇప్పటికే ప్రభాస్ లేకుండా ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. ఇటీవలే ప్రభాస్ కూడా ఈ సినిమా సెట్లో అడుగు పెట్టాడు. అమితాబ్, ప్రభాస్ కాంబినేషన్లో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఈ సందర్భంగా ప్రభాస్.. అమితాబ్‌కు తన ఆతిథ్య రుచి చూపించినట్లున్నాడు. ఈ నేపథ్యంలో బిగ్ బి ట్విట్టర్లో స్పందించారు. ‘‘బాహుబలి ప్రభాస్.. నీ దయాగుణం కొలవలేనిది. నువ్వు ఇంటి నుంచి వండి తీసుకొచ్చిన ఆహారం రుచి కొలవలేనిది.. నువ్వు తీసుకొచ్చిన భోజనాల బరువు కొలవలేనిది.. దాంతో ఒక సైన్యానికే భోజనం పెట్టొచ్చు. నువ్వు తెచ్చిన స్పెషల్ కుకీస్ రుచి కొలవలేనిది.

అలాగే నీ పొగడ్తల్ని జీర్ణించుకోవడం కూడా చాలా కష్టం’’ అని అమితాబ్ ట్వీట్ చేశారు. ఐతే అమితాబ్ వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులకైతే ఆశ్చర్యంగా ఏమీ అనిపించడం లేదు. యంగ్ రెబల్ స్టార్ గురించి అందరూ చెప్పే మాటలే ఇవి. కాగా అమితాబ్‌తో కలిసి నటిస్తుండటం పట్ల ప్రభాస్ కూడా చాలా ఎగ్జైట్ అవుతూ ఒక పోస్టు పెట్టడం తెలిసిందే. నిన్నటితరం ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్.. ఈ తరం సూపర్ స్టార్‌తో కలిసి నటిస్తుండటం భారతీయ ప్రేక్షకులను చాలా ఎగ్జైట్ చేసే విషయమే.