మారో దర్శకుడికి చైతూ గ్రీన్ సిగ్నల్

అక్కినేని నాగచైతన్య.. ప్రస్తుతం కెరీర్ పీక్స్‌లో ఉన్నాడని చెప్పొచ్చు. మజిలీ, లవ్ స్టోరి, బంగార్రాజు.. ఇలా అతను లీడ్ రోల్ చేసిన చిత్రాలన్నీ వరుసగా విజయవంతం అవుతున్నాయి. ‘బంగార్రాజు’కు డివైడ్ టాక్ వచ్చినా సరే.. సంక్రాంతి రిలీజ్ టైమింగ్ కలిసొచ్చి సినిమా విజయవంతం అయింది. ప్రస్తుతం అతను ‘థ్యాంక్ యు’ మూవీని విడుదలకు సిద్ధం చేశాడు. త్వరలోనే అది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాను రూపొందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే చైతూ.. ‘దూత’ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తమిళ బ్లాక్ బస్టర్ ‘మానాడు’ను చైతూ హీరోగా తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటమూ తెలిసిందే. ఇది కాక చైతూ హీరోగా ఇప్పుడు ఇంకో సినిమా కన్ఫమ్ అయింది. ఆ సినిమాకు దర్శకుడు కిషోర్ తిరుమల కావడం విశేషం. 

ఇంతకుముందు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, రెడ్ సినిమాలను రూపొందించిన కిషోర్.. త్వరలోనే ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన కిషోర్.. తాను తర్వాత చేయబోయే సినిమాలో హీరో చైతూనే అని వెల్లడించాడు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నట్లు కూడా తెలిపాడు.

దానయ్య అంటే బడ్జెట్లు కాస్త పెద్దగానే ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్లోనే అతి పెద్ద బేనర్లలో ‘డీవీవీ సినిమా’ ఒకటి.ఈ బేనర్లో చైతూ సినిమా చేయబోతుండటం.. కిషోర్ లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ దీన్ని రూపొందించనుండటం చైతూ అభిమానులను ఎగ్జైట్ చేసేదే. ఫ్యామిలీ టచ్ ఉన్న ప్రేమకథా చిత్రాలు తీయడంలో కిషోర్ నైపుణ్యం గురించి అందరికీ తెలిసిందే. ఈ తరహా కథలకు చైతూ కూడా బాగానే సెట్టవుతాడు. కాబట్టి ఈ కాంబినేషన్లో ఓ మంచి సినిమాను ఆశించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది.