వెంకీతో తీయాలనుకుంది ఈ కథ కాదు

ఆడవాళ్ళు మీకు జోహార్లు.. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం. రష్మిక కథానాయికగా నటించిన ఈ చిత్రానికి.. ఇంతకుముందు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, రెడ్ సినిమాలు తీసిన కిషోర్ తిరుమల దర్శకుడు. ఐతే ఇదే పేరుతో ఇంతకుముందు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో కిషోర్ సినిమా తీయాలని ప్రయత్నించడం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాకు అంతా ఓకే అనుకుని.. ఇక సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అనుకున్నాక దాన్ని పక్కన పెట్టేశారు.

ఆ తర్వాత కిషోర్ ‘చిత్రలహరి’, ‘రెడ్’ సినిమాలు తీశాడు. అవి పూర్తయ్యాక శర్వా హీరోగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ టైటిల్‌తో సినిమా మొదలుపెట్టాడు. దీంతో వెంకీతో తీయాలనుకున్న కథనే శర్వాతో చేస్తున్నాడని.. మరి సీనియర్ హీరో కోసం అనుకున్న కథను యంగ్ హీరోతో ఎలా వర్కవుట్ చేస్తాడో అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.ఐతే వెంకీతో తీయాలనుకున్న కథ.. శర్వాతో తీసిన కథ ఒకటి కాదని అంటున్నాడు కిషోర్ తిరుమల.

ఇదే టైటిల్‌తో వెంకీ హీరోగా సినిమా తీయాలనుకున్న మాట వాస్తవమే అని.. ఐతే హీరో మారాక కథ కూడా మారిందని చెప్పాడు కిషోర్. టైటిల్‌తో పాటు హీరో క్యారెక్టరైజేషన్ మాత్రమే తీసుకుని.. వేరే కథతో ఈ సినిమా తీసినట్లు కిషోర్ వెల్లడించాడు.

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. ఇందులో ‘నువ్వు నాకు నచ్చావ్’ తరహా ఫీల్ ఉంటుందని కిషోర్ తెలిపాడు. శర్వా-రష్మికల కెమిస్ట్రీ ఈ సినిమాకు మేజర్ హైలైట్ అని చెప్పాడు. చిన్న చిన్న హావభావాలను కూడా అద్భుతంగా పలికించగల రాధిక, ఖుష్బు లాంటి నటీమణులు ఈ సినిమాలో నటించడం బాగా కలిసొచ్చిందని.. వాళ్ల నటన అందరినీ ఆకట్టుకుంటుందని కిషోర్ అన్నాడు. వెంకీ తనకెంతో ఇష్టమైన హీరో అని.. ఆయనతో కచ్చితంగా ఒక సినిమా చేస్తానని కిషోర్ చెప్పాడు.