‘భీమ్లా నాయక్’ టికెట్‌కు డబ్బులివ్వలేదని ఆత్మహత్య

చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకునే వాళ్లను చూసి జాలి పడాలో.. బాధ పడాలో.. కోప్పడాలో అర్థం కాదు. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుని తామే ఆశగా శ్వాసగా జీవించే కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచెత్తి.. జీవితాంతం వారికి తీరని బాధని మిగులుస్తుంటారు కొందరు. అందులోనూ కడుపున పుట్టిన వారు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే తట్టుకోవడం ఆ తల్లిదండ్రుల తరమవుతుందా? అందులోనూ ఒక సినిమా చూసేందుకు తండ్రి టికెట్ డబ్బులు ఇవ్వలేదని ఒక కొడుకు ఆత్మహత్యకు పాల్పడటం ఎంత దారుణం? జగిత్యాలలో ఈ దారుణమే జరిగింది.

తెలంగాణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. యూత్ పవన్ అంటే వెర్రెత్తిపోతారు. జగిత్యాలలోని పురానీ పేటకు చెందిన నవదీప్ కూడా అలాంటి అభిమానే. పవన్ కొత్త సినిమా ‘భీమ్లా నాయక్’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నెల 25న విడుదలకు షెడ్యూల్ అయినప్పటికీ.. ఆ రోజు సినిమా వస్తుందన్న గ్యారెంటీ లేదు. వాయిదా పక్కా అంటున్నారు.

ఐతే ఇంకా రిలీజ్ డేట్ ఖరారవ్వని ఈ సినిమాకు ఎక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారో ఏమో తెలియదు కానీ.. తన స్నేహితులతో కలిసి ఈ సినిమాకు టికెట్ బుక్ చేసుకోవడానికి నవదీప్ తన తండ్రిని డబ్బులు అడిగాడట. టికెట్ డబ్బులకు తోడు స్నేహితుడికి కూడా కొంత మొత్తం ఇవ్వాల్సి ఉండటంతో మొత్తంగా రూ.300 ఇవ్వాలని తండ్రి నర్సయ్యను అడిగాడట.

ఐతే కూలి పని చేసుకునే నర్సయ్య దగ్గర అప్పటికి డబ్బులు లేకపోవడంతో ఇవ్వను పొమ్మన్నాడట. నువ్వు అడిగితే ఎప్పుడు పైసలిచ్చావ్ అంటూ నవదీప్ ఆగ్రహంగా గదిలోకి వెళ్లిపోయి డోర్ పెట్టుకున్నాడట. కాసేపటికే నవదీప్ బయటికి రావట్లేదని డోర్ కొడితే తీయలేదట. తలుపు బద్దలుకొట్టి చూస్తే నవదీప్ ఉరివేసుకుని కనిపించాడు. అప్పటికే అతడి ప్రాణాలు పోయాయి. చిన్న కారణంతో ఇలా ప్రాణాలు తీసుకున్న కొడుకుని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఉదంతం జగిత్యాల ప్రాంతంలో విషాదం నింపింది.