డ్యామేజ్ అంతా దర్శకుడికే…

ఖిలాడి.. ఈ ఏడాది అత్యధిక అంచనాలతో వచ్చిన సినిమా. ‘క్రాక్’ లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత మాస్ రాజా రవితేజ నటించిన చిత్రమిది. ‘రాక్షసుడు’తో విజయాన్నందుకున్న రమేష్ వర్మ దీనికి దర్శకుడు. మాస్ రాజా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించారు కోనేరు సత్యనారాయణ. దేవిశ్రీ ప్రసాద్, జీకే విష్ణు, సుజీత్ లాంటి పేరున్న టెక్నీషియన్లు.. రావు రమేష్, సచిన్ ఖేద్కర్, ముకేష్ రుషి, అర్జున్ లాంటి పేరున్న తారాగణంతో పెద్ద రేంజిలోనే తెరకెక్కిందీ చిత్రం. టీజర్.. ట్రైలర్ ఇతర ప్రోమోలన్నీ రిచ్‌గా కనిపించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెిరగాయి.

కానీ తెర మీద బొమ్మ చూసిన వాళ్లకు దిమ్మదిరిగిపోయింది. అన్నీ పైపై మెరుగులే తప్ప సినిమాలో విషయం కనిపించలేదు. హీరోయిన్ల వీర లెవెల్ స్కిన్ షో తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. రవితేజ సైతం సినిమాను కాపాడలేని పరిస్థితి.ప్రి రిలీజ్ బజ్ వల్ల సినిమాను లాభాలకు అమ్ముకున్నారు కానీ.. బయ్యర్లు నిండా మునిగిపోయేలాగే కనిపిస్తున్నారు. బాగా హైప్ చేసి హిందీలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు కానీ.. అక్కడ సినిమా ఏమంత ప్రభావం చూపట్లేదు.

అన్ని చోట్లా బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు. ఈ సినిమా వల్ల అత్యధిక డ్యామేజ్ దర్శకుడికే అన్నది స్పష్టం. రవితేజ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా చకచకా సినిమాలు చేసుకుపోతుంటారు. ఆయనపై ఫ్లాపుల ప్రభావం పెద్దగా కనిపించదు. ఈ ఏడాది ఆయన్నుంచి ఇంకో మూడు సినిమాలు రాబోతున్నాయి. కాబట్టి ‘ఖిలాడి’ ఫెయిల్యూర్ అయినా ఆయనకు ఇబ్బంది లేదు. ఈ సినిమాలో చేసిన స్కిన్ షోతో హీరోయిన్లకూ ఛాన్సులు బాగానే వచ్చేలా కనిపిస్తోంది.

ఇక నిర్మాత ముందే సేఫ్ అయిపోయాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఎటొచ్చీ దర్శకుడు రమేష్ వర్మకే ఇబ్బందులు తప్పేలా లేవు. అసలే అతడి కెరీర్ అంతంతమాత్రం. కొరియన్ మూవీని కాపీ కొట్టి తీసిన ‘రైడ్’, తమిళ రీమేక్ అయిన ‘రాక్షసుడు’ తప్ప మిగతా చిత్రాలన్నీ డిజాస్టర్లకే. లేక లేక సొంత కథతో ఓ పెద్ద హీరోతో సినిమా తీస్తే అది తుస్సుమనిపించింది. ఈ సినిమా వైఫల్యమంతా అతడికే చుట్టుకునేలా కనిపిస్తోంది. నిర్మాత కోనేరు సత్యనారాయణతో ఎంత సాన్నిహిత్యం ఉన్నా.. ఆయన బేనర్లో ఆస్థాన దర్శకుడిలా మారినా.. ‘ఖిలాడి’ లాంటి సినిమా తర్వాత రమేష్‌ను నమ్మి ఇంకో పేరున్న హీరో ఎవరైనా ఛాన్స్ ఇస్తారా అన్నది డౌటే.