ఆశలన్నీ మాస్ రాజా మీదే

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత ఎలా అయితే తెలుగు సినిమా పుంజుకుందో.. సెకండ్ వేవ్ తర్వాత అదే స్థాయిలో రైజ్ అయి మిగతా భాషల వాళ్లకు కళ్లు కుట్టేలా చేసింది. ఈ రెండు సందర్భాల్లోనూ తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ ఎలాంటిదో అందరికీ అర్థమైంది. ఐతే సెకండ్ వేవ్ ముప్పు తొలగిపోయాక ఇక కరోనా భయాలేమీ ఉండవనే అనిపించింది. అక్టోబరు, నవంబరు నెలల్లో అంచనా వేసినట్లుగా మూడో వేవ్ రాకపోవడమే అందుక్కారణం.

డిసెంబరులో అఖండ, పుష్ప చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర జాతర చేయడంతో టాలీవుడ్ ఉత్సాహం మామూలుగా లేదు. వాటికే ఇలా ఉంటే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు ఇంకే స్థాయిలో సందడి చేస్తాయో అనుకున్నారంతా. కానీ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. కరోనా మూడో వేవ్ ఉన్నట్లుండి విజృంభించడంతో బాక్సాఫీస్ కళ తప్పింది. సంక్రాంతికి వచ్చిన ‘బంగార్రాజు’ ఏదో ఒక మోస్తరుగా ఆడింది. మిగతా రెండు చిత్రాలూ తుస్సుమనిపించాయి.

తర్వాతి మూడు వారాల్లో బాక్సాఫీస్ వెలవెలబోయింది.ఇక మళ్లీ మునుపటి రోజులు రావడానికి చాలా టైం పడుతుందేమో అనుకున్నారు కానీ.. అదృష్టవశాత్తూ మూడో వేవ్ ప్రభావం తగ్గింది. బాక్సాఫీస్‌లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. వాయిదా తప్పదనుకున్న పెద్ద సినిమా ‘ఖిలాడి’ ముందు షెడ్యూల్ అయినట్లే ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై మొత్తం ఇండస్ట్రీ దృష్టి నిలిచి ఉంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత మాదిరే ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ బాక్సాఫీస్ నిలదొక్కుకోవడానికి ఈ సినిమా ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు.

ఈ సినిమాతోనే మళ్లీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. మూడో వేవ్ తర్వాత రిలీజవుతున్న తొలి భారీ చిత్రం కావడం, పోటీ తక్కువగా ఉండటంతో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. మరి సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటుందా.. మాస్ రాజా అందరూ ఆశిస్తున్న ఊపును తిరిగి తెస్తాడా అన్నది ఆసక్తికరం. ఈ వారం దీంతో పాటు తమిళ అనువాద చిత్రం ‘ఎఫ్ఐఆర్’ చెప్పుకోదగ్గ స్థాయిలోనే రిలీజవుతోంది. దీనికి రవితేజ సమర్పకుడు కావడం విశేషం. అలాగే ‘సెహరి’ అనే చిన్న సినిమా కూడా విడుదలవుతోంది. మరి ఇవి ఏమేర ప్రభావం చూపిస్తాయో చూడాలి.