సమంత మళ్లీ ఊ అందా?

ఊ అంటావా ఊ ఊ అంటావా మావా అంటూ సమంత సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హస్కీ వాయిస్‌తో గమ్మత్తుగా సాగే ఈ పాటకి సమంతే హైలైట్ అనడంలో సందేహమే లేదు. యూట్యూబ్‌లో అత్యంత ఎక్కువ మంది చూసిన వీడియోల లిస్టులో మొదటి స్థానంలో నిలిచిందంటే ఈ సాంగ్ ఎంతగా ఊపేసిందో అర్థం చేసుకోవచ్చు.

అసలు పుష్ప చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తోందన్న వార్తే ఆమె అభిమానుల్లో జోష్‌ని నింపేసింది. బన్నీ ఫ్యాన్స్‌ని సైతం సంతోషంలో ముంచింది. అయితే లిరికల్ సాంగ్ రిలీజయ్యాక సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరిగింది. సమంత వ్యక్తిగత జీవితానికి లింక్ చేస్తూ కొందరు ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు. కావాలనే ఇలాంటివి చేస్తోందని, తనకిదంతా అవసరమా అని ఏవేవో అన్నారు.       కానీ ఆ పాట క్రియేట్ చేసిన సెన్సేషన్‌లో నెగిటివ్ వైబ్స్ అన్నీ కొట్టుకుపోయాయి.

సాంగ్ షూట్ చేసేటప్పుడు సమంత ఎంత మథనపడిందో బన్నీ చెప్పాక.. ఎంత ఎఫర్ట్ పెట్టి డెడికేషన్‌తో డ్యాన్స్ చేసిందో టీమ్ అంతా పదే పదే చెప్పి పొగిడాక సీన్ మొత్తం మారిపోయింది. ఆమెపై ప్రశంసల జల్లు కుదిరింది. ఆ హుషారులో సామ్ మరో ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.       

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తీస్తున్న ‘లైగర్‌‌’లో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడనుందట సమంత. పూరి సినిమాల్లో కచ్చితంగా ఇలాంటి పాట ఒకటి ఉంటుంది. దాని కోసం ఎవరెవరినో తీసుకొస్తుంటాడు పూరి. కానీ ‘ఊ అంటావా’ పాట చూశాక సమంతతోనే చేయించాలని  ఫిక్సయ్యాడట. ‘మహానటి’లో కలిసి నటించారు కాబట్టి విజయ్‌ కూడా సామ్‌తో దీని గురించి మాట్లాడాడని, ఆ చనువుతోనే ఆమె కూడా ఓకే అన్నదని చెప్పుకుంటున్నారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే కానీ సమంత నిజంగా ఊ అందో లేదో క్లారిటీ రాదు.