2021 సమ్మర్లో బాక్సాఫీస్ బద్దలేనట

Bunny Vas

అల్లు అర్జున్‌కు సినీ వ్యవహారాల్లో అండగా ఉంటూ.. నెమ్మదిగా నిర్మాణ వ్యవహారాల్లోనూ అడుగు పెట్టి.. ఇప్పుడు ‘గీతా ఆర్ట్స్’ సంస్థను అన్నీ తానై నడిపించే స్థాయికి చేరుకున్నాడు బన్నీ వాసు. అల్లు అరవింద్ ఇప్పటికీ కీలక నిర్ణయాలు తనే తీసుకుంటున్నప్పటికీ.. గీతా సంస్థలో తెరకెక్కే సినిమాల ప్రొడక్షన్లో అత్యంత కీలక పాత్ర బన్నీ వాసుదే.

గత ఏడాది చివర్లో ‘ప్రతి రోజూ పండగే’తో భారీ విజయాన్నందుకున్న గీతా ఆర్ట్స్.. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ లాంటి నాన్ బాహుబలి హిట్‌తో మొదలుపెట్టింది. కరోనా లేకుంటే వేసవిలోనూ గీతా ఆర్ట్స్ సినిమా సందడి ఉండేది. అఖిల్ అక్కినేని చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మేలోనే రిలీజ్ కావాల్సింది. ఈ సంస్థ అనౌన్స్ చేసిన ‘చావు కబురు చల్లగా’, ‘18 పేజెస్’ కూడా ఈ ఏడాదే రావాల్సింది. కానీ కరోనా అన్నింటినీ మార్చేసింది.

థియేటర్ల పరిస్థితి ఏంటో అర్థం కాని అయోమయం నెలకొందిప్పుడు. అవి ఎప్పుడు తెరుచుకుంటాయో.. తెరుచుకున్నా మునుపటిలా ప్రేక్షకులు వస్తారో రారో అన్న ఆందోళన నెలకొంది. ఐతే దీని గురించి మరీ కంగారు పడాల్సిన పని లేదంటున్నాడు బన్నీ వాసు. ఇప్పుడు నష్టపోయే మొత్తాన్ని వచ్చే ఏడాది సినీ పరిశ్రమ రికవర్ చేసుకుంటుందని ఆయన అన్నాడు.

వచ్చే ఏడాది వేసవిలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అద్భుతాలు జరుగుతాయని బన్నీ వాసు అంచనా వేశాడు. జనాలు ఈ ఏడాదంతా ఇల్లు, ఆఫీస్‌లకే పరిమితం అవుతున్నారని.. దీంతో వాళ్లు విసుగెత్తిపోతారని.. వచ్చే ఏడాది థియేటర్లకు విరగబడి వస్తారని వాసు అన్నాడు. వచ్చే వేసవికి కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా రాకపోయినా జనాలు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తారని.. దీంతో బాక్సాఫీస్‌పై కనక వర్షం కురుస్తుందని అతను చెప్పాడు.

ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి బన్నీ వాసు చెబుతూ.. తాను, దర్శకుడు హరీష్ శంకర్ ఉమ్మడిగా.. దీపక్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపాడు. అలాగే మారుతి కొత్త చిత్రాన్ని కూడా తనే నిర్మిస్తానన్నాడు.