‘ఫ్యామిలీ మేన్‌’ మేకర్స్‌తో నాగశౌర్య మూవీ?

సినిమాల లైనప్‌ పెద్దగానే ఉన్నా సరైన హిట్టు మాత్రం ఖాతాలో పడటం లేదు నాగశౌర్యకి. ఈ యేడు ఆల్రెడీ వరుడు కావలెను, లక్ష్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  కానీ ఆ రెండూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో నెక్స్ట్ సినిమాలపైనే హోప్స్ పెట్టుకున్నాడు.    

ప్రస్తుతం శౌర్య చేతిలో మూడు సినిమాలున్నాయి. అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చేస్తున్నాడు. రాజేంద్ర డైరెక్షన్‌లో ‘పోలీసువారి హెచ్చరిక’ అనే మరో సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. అలాగే అనీష్‌ కృష్ణతో తమ సొంత బ్యానర్‌‌లోనే ఓ సినిమా రెడీ అవుతోంది. వీటితో పాటు మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్‌కి కూడా కమిటైనట్టు తెలుస్తోంది.     

‘ద ఫ్యామిలీ మేన్‌’ సిరీస్‌తో నేషనల్‌ లెవెల్‌లో పాపులర్ అయిన రాజ్‌ నిడమోరు, డీకే కృష్ణలతో ఓ సినిమా చేయబోతున్నాడట నాగశౌర్య. అయితే దీన్ని వాళ్లు డైరెక్ట్ చేయరట. కేవలం నిర్మిస్తారట. గతంలోనూ వారు డీ ఫర్ దోపిడీ, సినిమా బండి లాంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు శౌర్యతో సినిమా ప్లాన్ చేశారట. ‘సినిమా బండి’ తీసిన ప్రవీణ్ కాండ్రేగులకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.     

అదే కనుక నిజమైతే ఇది చాలా మంచి కాంబినేషన్ అని చెప్పాలి. రాజ్‌, డీకేలు మేకింగ్ టెక్నిక్స్, మార్కెట్ వేల్యూస్ తెలిసినవాళ్లు. ఏ ప్రాజెక్ట్ చేసినా ఫుల్ క్లారిటీతో ఉంటారు ఇక ప్రవీణ్‌ ‘సినిమాబండి’ని అద్భుతంగా తెరకెక్కించి బోలెడన్ని ప్రశంసలు అందుకున్నాడు. వీళ్లు మరోసారి కలుస్తున్నారంటే ఓ మంచి మూవీని ఆశించవచ్చు. కాబట్టి వారితో పని చేయడం శౌర్యకి కచ్చితంగా ప్లస్ అవుతుంది.