రామ్ చరణ్ 16.. స్టార్ట్ చేయాల్సిందే!

‘ఆర్ఆర్ఆర్’ కోసం మూడేళ్ల సమయాన్ని వెచ్చించాడు రామ్ చరణ్. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తవడం ఆలస్యం.. చరణ్ తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించేశాడు. శంకర్ దర్శకత్వంలో కొత్త సినిమాకు ముందే రంగం సిద్ధం చేసుకుని.. రాజమౌళి నుంచి విడుదల లభించగానే ఈ సినిమాను మొదలుపెట్టేశాడు. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తి చేసుకుందీ చిత్రం.

మూడో షెడ్యూల్‌కు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలోనే దీనికి బ్రేకులు పడ్డాయి. రెండేళ్ల కిందట అర్ధంతరంగా ఆగిపోయిన ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది. కమల్ హాసన్ చొరవ తీసుకుని లైకా ప్రొడక్షన్స్, శంకర్ మధ్య సమస్యను పరిష్కరించి ఈ సినిమాను తిరిగి పట్టాలెక్కించడానికి అంగీకారం కుదిర్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను మళ్లీ సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నారట. దీని కోసం శంకర్ దాదాపు ఆరు నెలలు వెచ్చించబోతున్నట్లు సమాచారం.

శంకర్ పరిస్థితిని అర్థం చేసుకుని చరణ్.. ఆయనతో సినిమాను హోల్డ్‌లో పెడుతున్నట్లు తెలుస్తోంది. టీంలో అందరికీ వేరే కమిట్మెంట్లుంటే చూసుకోమని చెప్పేశారట. కాల్ షీట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయని.. మళ్లీ శంకర్, చరణ్ అందుబాటులో ఎప్పుడొస్తారన్నదాన్ని బట్టి కొత్త షెడ్యూళ్లు ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. చరణ్ ఆలస్యం చేయకుండా తన తర్వాతి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. యువి క్రియేషన్స్ నిర్మాణంలో ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయడానికి చరణ్ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సినిమాకు బాలీవుడ్ భామ దిశా పఠానిని కథానాయికగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మిగతా కాస్ట్ అండ్ క్రూను కూడా ఖరారు చేసి చిత్రీకరణ మొదలుపెట్టబోతున్నారట. శంకర్ తిరిగొచ్చేలోపు సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీనా అని దర్శకుడు గౌతమ్‌ను ఇంతకుముందు అడిగితే.. అంతకుమించి అని సమాధానం ఇవ్వడం విశేషం.