అల్లుడి సినిమా సీక్వెల్‌లో పవన్?

ఓవైపు తన పొలిటికల్‌ కెరీర్‌‌తో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు కమిటవుతున్నారు పవన్ కళ్యాణ్. ఆల్రెడీ ‘భీమ్లానాయక్’ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ‘హరిహర వీరమల్లు’ త్వరలోనే తిరిగి సెట్స్‌కి వెళ్లబోతోంది. హరీష్ శంకర్ సినిమా లైన్‌లో ఉంది. ఇంతలో మరికొన్ని సినిమాలకు పీకే కమిటయ్యే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ‘రిపబ్లిక్’ సీక్వెల్ ఒకటి.

సాయిధరమ్ తేజ్ హీరోగా దేవా కట్ట తీసిన ఈ సినిమా బ్యూరోక్రసీపై పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్‌ని కళ్లకు కట్టింది. సీరియస్ కాన్సెప్ట్‌ని సిన్సియర్‌‌గా తీసి మెప్పించాడు దేవా. ఐఏఎస్ ఆఫీసర్‌‌గా తేజ్ నటనకు కూడా ఫుల్ మార్కులు పడ్డాయి. కమర్షియల్‌గా అంత కలిసి రాకపోయినా, మంచి సినిమా అనే ముద్ర అయితే వేయించుకుంది రిపబ్లిక్. అందుకే దీనికి సీక్వెల్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దేవా.

అయితే ఈసారి తేజ్ కాదు.. పవన్ కళ్యాణ్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి దేవాకి పవన్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు. రిపబ్లిక్‌ని కూడా పవన్‌ని దృష్టిలో పెట్టుకునే రాశాడట. కానీ ఆయన ఇమేజ్‌కి ఆ కథ సరిపోతుందో లేదోననే అనుమానంతో అడగలేకపోయానని తనే చెబుతున్నాడు. సీక్వెల్‌కి మాత్రం పవన్‌ని ఎలాగైనా కమిట్ చేయించాలని డిసైడ్ చేసుకున్నాడట దేవా.

ఈసారి కాన్సెప్ట్‌ మరింత సీరియస్ అట. హీరో రోల్ మరింత మెచ్యూర్డ్‌గానూ ఉంటుందట. కాబట్టి తనకంటే మావయ్య పవన్ అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలడని తేజ్ కూడా అన్నాడట. అయితే పొలిటికల్ కాన్సెప్ట్ అంటే కాస్త రిస్కే. ఎవరి మనోభావాలూ దెబ్బ తినకుండా, తన పొలిటికల్ కెరీర్‌‌కి దెబ్బ తగలకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. విమర్శలకు తావు లేకుండా సినిమాని తీయగలగాలి. కాబట్టి పవన్‌ ఓకే అంటారా లేదా అనే దానిపైనే ఈ ప్రాజెక్ట్ ఆధారపడి ఉంది.