రాజ‌మౌళి ఫ్యామిలీ అన్నీ పోగొట్టుకున్న వేళ సిరివెన్నెలే..

ఇప్పుడు రాజ‌మౌళి కుటుంబానికి ఆర్థికంగా ఏ లోటూ లేదు. రాజ‌మౌళితో పాటు విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, కీర‌వాణి.. ఇంకా చాలామంది క‌లిసి ఒక ప్యాకేజీ లాగా సినిమాలు చేస్తూ కావాల్సినంత సంపాదిస్తున్నారు. కానీ 90వ ద‌శ‌కంలో ఈ కుటుంబం చాలా క‌ష్టాలు ప‌డింది. ఆ క‌ష్టాల గురించి రాజ‌మౌళి, కీర‌వాణి, విజ‌యేంద్ర ప్ర‌సాద్ అప్పుడ‌ప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి మ‌ర‌ణం నేప‌థ్యంలో రాజ‌మౌళి ఆ రోజుల‌ను గుర్తు చేసుకోవ‌డం, తాము క‌ష్టాల్లో ఉన్న టైంలో సిరివెన్నెల మాట‌లే స్ఫూర్తిగా నిలిచి తాము నిల‌దొక్క‌కున్నామ‌ని చెప్ప‌డం విశేషం.

1996లో త‌మ కుటుంబం స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించిన అర్థాంగి సినిమాతో తాము స‌ర్వం కోల్పోయిన స్థితిలో ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దురా ఓట‌మి, ఎప్పుడూ వ‌దులుకోవ‌ద్దురా ఓరిమి అనే మాట‌లే స్ఫూర్తిగా నిలిచి త‌నను న‌డిపించాయ‌ని రాజ‌మౌళి తెలిపాడు.

ఆ ఏడాది డిసెంబ‌రు 31న రాత్రి సీతారామ‌శాస్త్రితో స్వ‌యంగా ఇదే పాట‌ను ఒక నోట్ బుక్‌లో రాయించుకుని, సంత‌కం తీసుకున్నాన‌ని.. త‌ర్వాతి రోజు జ‌న‌వ‌రి 1న త‌న తండ్రికి ఆ కాగితాన్నే బ‌హుమ‌తిగా ఇస్తే ఆయ‌న ఎంతో ఆనందించి కొత్త ఉత్సాహంతో క‌నిపించార‌ని రాజ‌మౌళి గుర్తు చేసుకున్నాడు. ఆ ర‌కంగా త‌న జీవిత గ‌మ‌నానికి సీతారామ‌శాస్త్రి దిశా నిర్దేశం చేశార‌ని రాజ‌మౌళి అన్నాడు.

త‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సింహాద్రిలో అమ్మ‌యినా నాన్న‌యినా.. మ‌ర్యాద రామ‌న్నలో ప‌రుగులు తీయ్ పాట‌ల‌ను సీతారామ‌శాస్త్రి రాశార‌ని.. ఐతే అమ్మా నాన్న లేకుంటే బాగుంటుంద‌ని, పారిపోవ‌డం గొప్ప అని ఎలా రాస్తాం అని త‌న‌తో వాదించి.. చివ‌రికి ఈ స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తానని చెప్పి ఆ పాట‌లు రాశార‌ని.. చివ‌ర‌గా ఆర్ఆర్ఆర్ కోసం దోస్తీ పాట రాశార‌ని.. ఐతే ఆయ‌న పాట రాస్తున్న షాట్ తీసి మ్యూజిక్ వీడియోలో పెడ‌దామ‌నుకున్నామ‌ని.. కానీ అప్ప‌టికే ఆయ‌న‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో అలా చేయ‌లేక‌పోయామ‌ని రాజ‌మౌళి వివ‌రించాడు.