టికెట్ రేట్ ఇష్యూ పై బాబు కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థలోనే సినిమా టికెట్స్ ను అమ్మాల్సి ఉంటుందని వెల్లడించింది. అలానే ప్రభుత్వం డిసైడ్ చేసే రేట్లకే టికెట్స్ ను అమ్మాలని సినిమాటోగ్ర‌ఫీ చట్టాల్లో సవరణలు తీసుకొచ్చింది. ఇలా చేయడం వలన పెద్ద సినిమాలకు భారీ నష్టాలు వాటిల్లే ఛాన్స్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోలు ఇప్పటికే జగన్ రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఈ విషయంపై స్పందించారు.

ఇప్పుడున్న టికెట్ రేట్లనే కంటిన్యూ చేస్తే.. కరెంట్ బిల్ కూడా కట్టుకోలేమని.. ఇదే పరిస్థితి కొనసాగితే.. థియేటర్లు మూసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారాయన. మార్కెట్ లో ఒక్కో వస్తువుకి ఒక్కో రేటు ఉంటుందని.. అన్ని వస్తువులను కలిపి ఒకే రేటుకి అమ్మాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. సినిమా కూడా అంతేనని అన్నారు. పెద్ద సినిమాల బడ్జెట్, చిన్న సినిమాల బడ్జెట్ ఒకలా ఉందని చెప్పారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెద్ద సినిమాలు భారీగా నష్టపోతాయని చెప్పారు. బ్లాక్ లో టికెట్స్ అమ్మడాన్ని కంట్రోల్ చేయడం కోసమే అని కారణాలు చెబుతున్నారని.. బ్లాక్ టికెట్ వ్యవస్థ మహా అయితే రెండు, మూడు రోజులు ఉంటుందేమో.. ఆ తరువాత మామూలు రేటుకే టికెట్స్ ను అమ్ముతారని చెప్పారు.

వెయ్యి కోట్ల విలువ కూడా లేని ఈ పరిశ్రమపై ఇన్ని రూల్స్ ఏంటో అర్ధం కావడం లేదని అన్నారు. థియేటర్లో ప్రేక్షకులను బలవంతగా కూర్చోబెట్టలేమని.. నచ్చినవాళ్లు సినిమా చూస్తారని, లేదంటే లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్నాయని.. ఇలా అయితే చాలా కష్టమని చెప్పుకొచ్చారు.