రైజింగ్ రాజు కదిలించేశాడబ్బా..

Raising Raju
Raising Raju

తెరపై కామెడీ చేసేవాళ్లందరూ నిజ జీవితంలో అంతే ఆనందంగా ఉంటారనుకుంటే పొరబాటే. వాళ్ల జీవితాల్లో కన్నీళ్లు, కష్టాలు చాలా ఉంటాయి. ‘జబర్దస్త్’ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించిన రైజింగ్ రాజు ఈ కోవకే చెందుతాడు. అతను లేటు వయసులో ఆర్టిస్ట్ అయ్యాడు. ‘జబర్దస్త్’ పుణ్యమా అని జనాల్లో గుర్తింపు సంపాదించాడు. ఈ షో ద్వారానే అతడి జీవితం బాగు పడింది. అంతకుముందు తాను ఎదుర్కొన్న కష్టాల గురించి కొన్ని యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో పంచుకున్న వీడియోలు చూస్తే మనసు కరిగిపోతుంది.

జబర్దస్త్ స్కిట్లలో ఆది చేత ఎప్పుడూ పంచులేయించుకుంటూ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తాడు కానీ.. నిజానికి ఆదితో రాజుకు గొప్ప అనుబంధం ఉంది. ఆది పేరెత్తితే చాలు కృతజ్ఞతా భావం కనిపిస్తుంది రాజు కళ్లల్లో. స్కిట్లలో అన్నీ తానై వ్యవహరించే ఆది.. తనకు టీమ్ లీడర్‌గా గౌరవాన్నివ్వడంతో పాటు పారితోషకం విషయంలోనూ పెద్ద పీట వేస్తాడని గతంలోనే చెప్పుకున్నాడు రాజు. తాజాగా ఒక ఎపిసోడ్ ప్రోమోలో ఆది గురించి మాట్లాడుతూ రాజు ఎమోషనల్ అయిన తీరు అందరినీ కదిలించేస్తోంది.

కరోనా టైంలో కొన్ని స్కిట్లలో రైజింగ్ రాజు కనిపించని సంగతి తెలిసిందే. ఆ టైంలో అతడికి ఏమైంది.. జబర్దస్త్ వదిలేశాడా అన్న చర్చ జరిగింది. ఐతే రాజు లేకున్నా టీం పేరుతో అతడి పేరు మాత్రం కొనసాగింది. అంతే కాదు.. ఆ టైంలో ప్రతి స్కిట్‌కూ పారితోషకం కూడా అందుకున్నాడట రాజు. ఆ సమయంలో రాజుకు మనవరాలు పుట్టిందట. తను రాజు ఇంట్లోనే ఉందట. తాను స్కిట్ల కోసం వెళ్లి వస్తే వైరస్ అంటించుకుని వచ్చి పసిబిడ్డకు ప్రమాదం తలెత్తుతుందన్న ఉద్దేశంతో రాజు షూటింగ్‌ నుంచి బ్రేక్ తీసుకున్నాడట.

పరిస్థితి అర్థం చేసుకుని స్కిట్లలో రాజు లేకుండానే మేనేజ్ చేసిన ఆది.. స్కిట్లలో లేకపోయినా ప్రతి నెలా రాజుకు పారితోషకం పంపించాడట. ఈ విషయాన్ని చెబుతూ.. చిన్నవాడు కాబట్టి ఆగిపోతున్నా కానీ లేకుంటే అతడికి పాదాభివందనం చేసేవాడినంటూ రాజు కన్నీళ్లు పెట్టుకున్న ప్రోమో సోషల్ మీడియాలో తిరుగుతోంది.