‘మా’ సభ్యుల కోసం మంచు విష్ణు కీలక నిర్ణయాలు

Manchu Vishnu
Manchu Vishnu

ఎన్నికలు ఎంత పోటాపోటీగా జరుగుతాయో.. ఎన్నికల అనంతరం హామీల అమలు విషయాన్ని పట్టించుకోకుండా ఉండటంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మించిన సంస్థ లేదన్న మాట తరచూ వినిపిస్తోంది. తోపుల్లాంటి బడా హీరోలు మొదలు ఒక మోస్తరు ఇమేజ్ ఉన్న వారితో సహా దగ్గర దగ్గర వెయ్యి మంది వరకు సినిమాకు చెందిన వారు ఉన్న ‘మా’ అసోసియేషన్ పని తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

గతానికి భిన్నంగా ఈసారి జరిగిన మా ఎన్నికలు ఎంతటి హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్.. ఫలితాల వెల్లడి సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా తన తోటి సభ్యుల కోసం భారీ ఎత్తున కసరత్తు చేసిన మంచు విష్ణు.. అసోసియేషన్ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన వైనం.. తాజాగా అతడు వెల్లడించిన విశేషాల్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థం కాక మానదు.

అసోసియేషన్ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో పెద్ద పీట వేస్తున్న వైనాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. అసోసియేషన్ సభ్యులు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం హైదరాబాద్ మహానగరంలోని పెద్ద ఆసుపత్రులైన ఏఐజీ.. అపోలో.. కిమ్స్.. మెడికవర్.. సన్ షైన్ ఆసుపత్రుల్లో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా వెల్లడించారు.

ఈ ఆసుపత్రుల్లో 50 శాతం రాయితీ మీద ఓపీ కన్సల్టేషన్ తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్సు సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు.. ఈ ఆసుపత్రుల్లో ఎప్పుడైనా సరే ఫ్రీగా పరీక్షలు చేయించుకోవచ్చని పేర్కొన్నారు. అంతేకాదు.. వైద్యులతో ఆన్ లైన్ ద్వారా సేవలు అందించే వీలుంది. అసోసియేషన్ లో ఉన్న సభ్యులందరికి దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామన్నారు.

ఇందులో భాగంగా డిసెంబరులో మెడికవర్.. మార్చిలో ఏఐజీ.. జూన్ లో అపోలో.. సెప్టెంబరులో కిమ్స్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శిబిరాల్ని నిర్వహించనున్నారు. అంతేకాదు.. టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్ లో ‘మా’ సభ్యులకు డిస్కౌంట్ మీద డయాగ్నస్టిక్ సేవల్ని అందించనున్నారు. మంచు విష్ణు నిర్ణయం ‘మా’లో ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పాలి.