విజయ్ కోసం పైడిపల్లి స్పెషల్ ప్లాన్

తెలుగు సినిమాల రీమేక్స్‌తో తమిళనాట హిట్స్ కొట్టి ఎదిగాడు విజయ్. ఇప్పుడు తన కోసం తెలుగు నిర్మాతలు క్యూ కట్టే స్థాయికి ఎదిగాడు. మొన్నమొన్నటి వరకు తన సినిమాల డబ్బింగ్ వెర్షన్స్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమానే చేయబోతున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మించే ఈ బైలింగ్వల్ మూవీ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీ అయ్యింది.

ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంటరెస్టింగ్ విషయం తెలిసింది. ఇందులో విజయ్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌‌లో కనిపించబోతున్నాడట. అతనికి ఎరొటోమేనియా అనే మానసిక సమస్య ఉంటుందట. ఈ వ్యాధి ఉన్నవాళ్లు ఒక రకమైన భ్రమలో ఉంటారు. తమ మనసుకు నచ్చిన వ్యక్తి తమని ప్రేమిస్తున్నట్టు అపోహ పడుతుంటారు. ఆ వ్యక్తికి తనెవరో తెలియకపోయినా, తనతో పరిచయం కూడా లేకపోయినా.. వీళ్లు మాత్రం వాళ్లతో రిలేషన్‌లో ఉన్నట్టు, టైమ్ స్పెండ్ చేస్తున్నట్టు ఫీలవుతారు. అలాంటి పాత్రలోనే విజయ్ కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి సమస్యలు మారుతి సినిమాల్లో ఎక్కువ కనిపిస్తుంటాయి. ఆయన తీసిన కొన్ని సినిమాల్లో హీరోలు లోపాలతో కనిపించారు. ఆ సినిమాలు సక్సెస్ అయ్యాయి కూడా. వంశీ కూడా అలాంటి కథే రాశాడని అంటున్నారు. ఇది మహేష్‌ బాబుకి చెబితే నో అన్నాడని, తర్వాత విజయ్‌కి నేరేట్ చేస్తే ఎస్ అన్నాడనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఎంతవరకు నిజమో తెలీదు కానీ.. నిజమైతే మాత్రం ఓ వెరైటీ పాత్రలో విజయ్‌ని చూసే చాన్స్ ప్రేక్షకులకి దొరుకుతుంది. కొంతకాలంగా కాస్త బరువుగా ఉండే పాత్రలే చేయడానికి ఇష్టపడుతున్న విజయ్‌కి ఇది మరో డిఫరెంట్ రోల్ అవుతుంది.

అయితే సినిమా అనౌన్స్‌మెంట్‌ తర్వాత ఇంతవరకు అఫీషియల్‌గా మరే విషయాన్నీ రివీల్ చేయలేదు టీమ్. ఎవరెవరు ఏయే పాత్రలు చేస్తున్నారు, ఏ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు, షూటింగ్ ఎప్పుడు లాంటివేమీ బయట పెట్టలేదు. స్క్రిప్ట్‌లో విజయ్ కొన్ని మార్పులు చెప్పాడని, ప్రస్తుతం అవి చేస్తున్నారని, అందుకే కాస్త టైమ్ పడుతోందని సమాచారం. హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై దర్శక నిర్మాతలు ఎప్పటికి క్లారిటీ ఇస్తారో మరి.