‘గని’ ప్లాన్ ఎందుకు మారింది?

మెగా ఫ్యామిలీ కుర్రాడు వరుణ్ తేజ్ కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘గని’. అతడి కెరీర్లోనే అత్యధిక ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం వరుణ్ ఎంతో కష్టపడి బాడీ మార్చుకున్నాడు. బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడు. అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబీకి నిర్మాతగా ఇదే తొలి సినిమా. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నదియా లాంటి పెద్ద పెద్ద నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

తెలుగులో అరుదుగా తెరకెక్కే అథెంటింగ్ స్పోర్ట్స్ డ్రామాల్లో ఒకటిగా ఇది కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని జులైలోనే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేయక తప్పలేదు. డిసెంబరు 10కి కొత్త డేట్ ఇచ్చారు కానీ.. దానికీ కట్టుబడలేదు. అందుకు షూటింగ్ ఆలస్యం కారణం కాదు. సినిమా దాదాపుగా రెడీ అయినప్పటికీ.. వ్యూహాత్మకంగానే డేట్ మార్చినట్లు తెలుస్తోంది.

డిసెంబరు 2న ‘అఖండ’ భారీ అంచనాలతో వస్తోంది. 17న రాబోతున్న ‘పుష్ప’ మీద అంచనాలు ఎలా ఉన్నాయో తెలిసిందే. మధ్యలో రావడం వల్ల కచ్చితంగా వసూళ్ల మీద ప్రభావం ఉంటుంది. అందులోనూ ‘పుష్ప’కు ముందు థియేటర్లలో దిగడం వల్ల సినిమా ఎంత బాగున్నా, ఎంత మంచి టాక్ వచ్చినా సందడి వీకెండ్ వరకే ఉంటుంది. తర్వాత ప్రేక్షకుల ఫోకస్ ‘పుష్ఫ’ మీదికి వెళ్లిపోతుంది. లాంగ్ రన్‌కు ఛాన్సే ఉండదు. రెండో వీకెండ్లో వసూళ్ల మీద ఆశలు పెట్టుకోవడానికి వీలుండదు. అలా కాకుండా 24న క్రిస్మస్ టైంలో రిలీజ్ చేస్తే థియేటర్లలో సందడి వేరుగా ఉంటుంది. అప్పటికి ‘పుష్ప’ హడావుడి కొంచెం తగ్గుతుంది. ఫోకస్ కొత్త చిత్రాల మీదికి మళ్లుతుంది.

‘శ్యామ్ సింగరాయ్’ కూడా పోటీలో ఉన్నప్పటికీ అది మరీ భారీ చిత్రం కాదు కాబట్టి క్రిస్మస్ సెలవుల్లో రెంటికీ స్కోప్ ఉంటుంది. ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే వరకు చెప్పుకోదగ్గ వేరే సినిమాలేవీ రిలీజ్ కావు కాబట్టి రెండు వారాల పాటు వసూళ్ల పంట పండించుకోవచ్చు. తొలి వారం క్రిస్మస్ సెలవులు కలిసొస్తాయి. అలాగే డిసెంబరు 31, జనవరి 1 రోజుల్లోనూ మంచి వసూళ్లు వస్తాయి. అందుకే వ్యూహాత్మకంగా ‘గని’ టీం డేట్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది.