‘లైగర్’పై కొత్త భయాలు

గత దశాబ్ద కాలంలో పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు ఎంత దారుణంగా ఉందో తెలిసిందే. ఒకప్పుడు ఎప్పటికప్పుడు కొత్త కథలను ఆవిష్కరిస్తూ బ్లాక్‌బస్టర్ల మీద బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన ఈ టాలీవుడ్ టాప్ డైరెక్టర్.. ఆ తర్వాత ఒక మూసలో పడిపోయాడు. ఎంతసేపు ‘మాఫియా’ చుట్టూ కథలను తిప్పి ప్రేక్షకులను తీవ్ర అసహనానికి గురి చేశాడు. ఆయన్నుంచి మరీ ‘రోగ్’ లాంటి నాసిరకం సినిమాలొస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. దానికి ముందు, తర్వాత కూడా పేలవమైన చిత్రాలనే అందించాడు పూరి.

ఐతే చాలా ఏళ్ల తర్వాత లేక లేక ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రం పెద్ద హిట్టయిపోయింది. ఐతే ఆ సినిమాలోనూ పూరి దర్శకుడిగా మెప్పించింది తక్కువే. చాలామందికి ఆ సినిమా విజయం ఫ్లూక్ లాగే అనిపించింది. విజయ్ దేవరకొండ ఆ టైంలో పూరీని నమ్మి ‘లైగర్’ ఒప్పుకుంటే తన అభిమానులు కొంచెం ఆందోళన చెందిన మాట వాస్తవం.

విజయ్ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు పూరి మీద ఉంది. అందుకేనేమో పూరి కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా మేకింగ్ టైం తీసుకుంటున్నాడు ‘లైగర్’ కోసం. కేవలం కరోనా మాత్రమే ఈ సినిమా ఆలస్యానికి కారణం కాదు. పాన్ ఇండియా సినిమా కావడం, కరణ్ జోహార్ లాంటి వాడు ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామి కావడం పూరి మీద మరింత బాధ్యత పెంచేదే. కానీ మామూలుగా చూస్తే పూరి ఎవరి కోసమో అలెర్ట్ అయి, జాగ్రత్త పడి సినిమా తీసే రకం అయితే కాదు. తనకు ఏమనిపిస్తే అది.. చకచకా తీసి పడేస్తాడు. లేకుంటే కొడుకు పూరి ఆకాశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘మెహబూబా’ లాంటి పేవలమైన సినిమా తీసేవాడు కాదు.

అతడి రెండో చిత్రం ‘రొమాంటిక్’కు కూడా స్క్రిప్టు అందించింది పూరీనే. ఆ సినిమా చూసి పూరి పూర్తిగా ఔట్‌డేట్ అయిపోయాడు, మూసలోంచి బయటికి రాలేకపోతున్నాడనే అభిప్రాయం బలంగా కలిగింది. ఈ సినిమా కథ రాసిన టైంలోనే ‘లైగర్’కు కూడా స్క్రిప్టు రాశాడు పూరి. అలాంటపుడు ఆయన గొప్ప మార్పు చూపించి ఉంటాడా..? ‘లైగర్’తో మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరచలడా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘రొమాంటిక్’ చూశాక ‘ఇస్మార్ట్ శంకర్’ ఫ్లూక్ హిట్ అనే అభిప్రాయం బలపడుతోంది. అదే సమయంలో ‘లైగర్’ మీద భయాలు పెరుగుతున్నాయి. ఈ స్థితిలో ఆ చిత్రంతో హిట్ కొడితే మాత్రం అదొక మిరాకిల్ అవుతుంది.