మెగా రీమేక్‌కి ముహూర్తం ఖరార్‌‌

ఇప్పటికే ‘లూసిఫర్’ రీమేక్‌తో బిజీగా ఉన్న చిరంజీవి.. ‘వేదాళం’ రీమేక్‌ని కూడా త్వరలో మొదలుపెట్టబోతున్నారు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ‘భోళాశంకర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి ముహూర్తం ఖరారయ్యింది.

నవంబర్ 11న ఉదయం 7:45కి చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు అనౌన్స్ చేశారు. అదే నెల 15 నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయబోతున్నారు. నిజానికి వరుస రీమేక్స్ చేయడం బాగోదు కనుక మెగాస్టార్ మధ్యలో ఓ స్ట్రెయిట్ సినిమా చేయాలనుకుంటున్నారని, అందుకే ఈ మూవీని కొన్నాళ్ల పాటు ఆపి బాబి డైరెక్షన్‌లో సినిమాని మొదలు పెడతారని వార్తలు వచ్చాయి. అవి నిజం కాదని ఈ ప్రకటనతో తేల్చేసింది టీమ్. వచ్చే యేడు థియేటర్స్‌లో మూవీని రిలీజ్‌ చేస్తామని కూడా కన్‌ఫర్మ్ చేసింది.

సిస్టర్‌‌ సెంటిమెంట్‌కి చాలా ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రంలో మెగాస్టార్‌‌కి చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించబోతోంది. ఆయనకి జోడీగా ఎవరు కనిపిస్తారనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. కథ ప్రకారం చిరు గ్యాంగ్‌స్టర్‌‌గా కనిపిస్తారు. ‘లూసిఫర్’ రీమేక్‌ ‘గాడ్‌ఫాదర్‌‌’లోనూ ఆయన చేస్తున్నది డాన్ పాత్రే. కాకపోతే రెండు క్యారెక్టర్స్‌కి చాలా వేరియేషన్‌ ఉంటుంది. ఏదేమైనా బ్యాక్‌ టు బ్యాక్ రీమేక్స్ చేయడం, రెండింటిలోనూ ఆయన గ్యాంగ్‌స్టర్‌‌ కావడం ఊహించని విశేషమే.