‘ఆర్ఆర్ఆర్’ మార్కెట్ రేంజ్ పడిపోయిందా..?

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలకు మార్కెట్ ఏ రేంజ్ లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా.. వందల కోట్లు కుమ్మరించి సినిమా హక్కులను కొనుక్కుంటూ ఉంటారు. అలాంటిది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించి మార్కెట్ రేట్ అనుకున్నదానికంటే తక్కువ పలుకుతోంది. ముఖ్యంగా ఆంధ్రా ఏరియాలో ‘ఆర్ఆర్ఆర్’ మార్కెట్ విలువ దాదాపు ముప్పై శాతం తగ్గించి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కరోనా తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పెద్దగా రావడం లేదు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ రేట్లు తగ్గించి అమ్ముతున్నారట.

నిజానికి ఆంధ్రా, సీడెడ్ లో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. ఒక్క ఈస్ట్ ఏరియాలోని ఈ సినిమాకు రూ.18 కోట్ల డీల్ వచ్చింది. ఇప్పుడు అందులో ఐదు కోట్లు తగ్గించి రూ.13 కోట్లకు సినిమా హక్కులను ఇస్తున్నారట. ఉత్తరాంధ్రలో మొదట రూ.26 కోట్లకు సినిమా హక్కులను అమ్మారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా.. ఆ మొత్తాన్ని రూ.19 కోట్లకు కుదించారు. దాదాపు వంద కోట్ల బిజినెస్ జరగాల్సిన ఈ రెండు ఏరియాల్లో ఇప్పుడు డెబ్భై కోట్ల బిజినెస్ కూడా జరగడం లేదు.

ఆంధ్రలో మిగిలిన ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి నైజాం, ఓవర్సీస్ బిజినెస్ లో ఎలాంటి మార్పు లేదు. కానీ వాళ్లు కూడా తగ్గించమని అడిగితే మాత్రం బిజినెస్ పై ఇంకా ఎఫెక్ట్ పడుతుంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో మాత్రమే కాదు.. ఏపీలో పెద్ద సినిమాలన్నింటి పరిస్థితి దాదాపుగా ఇంతే. ఇంతకముందు కుదుర్చుకున్న ఒప్పందాలను ఇప్పుడు మళ్లీ సవరిస్తున్నారట. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. రిలీజ్ కి ముందు ఓ ప్రమోషనల్ టూర్ ను ప్లాన్ చేస్తున్నారు.