ద్వితీయ విఘ్నం దాటలేకపోయాడే..

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో అజయ్ భూపతి రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. అనామకుడైన హీరో.. కొత్త హీరోయిన్ని పెట్టి తీసిన ఆ చిత్రం పది కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది. వివిధ భాషల్లో ఆ చిత్రం రీమేక్ కూడా అవుతోంది. ఈ సినిమాతో వచ్చిన ఫేమ్‌ను ఉపయోగించుకుని హీరో హీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ బాగానే అవకాశాలు సంపాదించారు. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ సైతం బిజీ అయ్యాడు.

ఐతే దర్శకుడు అజయ్ భూపతికి కూడా మంచి అవకాశాలే వచ్చినా అతను తొందరపడలేదు. ‘మహాసముద్రం’ కథకు ఫిక్స్ అయి.. కొంచెం ఆలస్యమైనా సరే ఈ కథనే, తాను కోరుకున్న నటీనటులతోనే తెరకెక్కించాడు. ఈ గురువారం దసరా కానుకగా ఈ చిత్రం విడుదలైంది. కానీ మంచి అంచనాల మధ్య విడుదలైన సినిమా.. ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది.

బడ్జెట్ సహా సరైన వనరులేమీ లేనపుడే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు అజయ్. కానీ కోరుకున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, మంచి బడ్జెట్, పూర్తి స్వేచ్ఛ.. ఇలా అన్నీ ఉన్నా ‘మహాసముద్రం’ను సరిగా తీర్చిదిద్దలేకపోయాడు. కథలోనే బలం లేకపోగా.. బోరింగ్ స్క్రీన్ ప్లే సినిమాకు ప్రతికూలంగా మారింది. ‘ఆర్ఎక్స్ 100’లో మాదిరి షాకులు.. సర్ప్రైజులు కూడా ఏమీ లేవీ చిత్రంలో. అజయ్ ఆహా ఓహా అని చెప్పుకున్నది ఇలాంటి సినిమా గురించా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

దర్శకుల విషయంలో ద్వితీయ విఘ్నం ఎప్పట్నుంచో ఉన్న సెంటిమెంటే. తొలి సినిమాతో అదరగొట్టిన చాలామంది దర్శకులు రెండో చిత్రంతో బోల్తా కొట్టిన వాళ్లే. సుకుమార్ లాంటి అగ్ర దర్శకుడు సహా చాలామందే ఈ జాబితాలో కనిపిస్తారు. ఇప్పుడు అజయ్ సైతం ఆ విఘ్నాన్ని దాటలేకపోయాడు. వీకెండ్లోనే సరిగా పెర్ఫామ్ చేయలేకపోతున్న ‘మహాసముద్రం’ సోమవారం నుంచి నిలవడం చాలా కష్టమే.