ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెలా?


గ‌దార్ః ఏక్ ప్రేమ్ క‌థ‌. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద విజ‌యం సాధించిన చిత్రాల్లో ఇదొక‌టి. స‌రిగ్గా రెండు ద‌శాబ్దాల కింద‌ట ఈ సినిమా రిలీజైంది. అప్ప‌టి భార‌తీయ సినిమా వ‌సూళ్ల రికార్డుల‌న్నింటినీ బ‌ద్ద‌లు కొట్టేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది గ‌దార్. స‌న్నీ డియోల్, అమీషా ప‌టేల్ జంట‌గా అనిల్ శ‌ర్మ ఈ చారిత్ర‌క చిత్రాన్ని తీర్చిదిద్దాడు.

1947లో దేశ విభ‌జ‌న సంద‌ర్భంగా అనుకోకుండా పాకిస్థాన్‌కు చేరిన భార్యా పిల్ల‌ల కోసం అక్క‌డి వెళ్లి పోరాడి వారిని వెన‌క్కి తీసుకొచ్చే యోధుడి క‌థ ఇది. ఇందులోని ఎమోష‌న్లు, యాక్ష‌న్ ఘ‌ట్టాలు అప్ప‌టి ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశాయి. స‌న్నీ డియోల్, అమీషాల కెరీర్ల‌లో ఎప్ప‌టికీ ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ సినిమాగా గ‌దార్ నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీయ‌డానికి ఎప్ప‌ట్నుంచో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మ‌ధ్య‌లో అవి ఆగిపోయి.. ఇప్పుడు మ‌ళ్లీ పురుడు పోసుకున్నాయి.

గ‌దార్ సీక్వెల్‌ను తాజాగా అధికారికంగా ప్ర‌క‌టించేశారు కూడా. అనిల్ శ‌ర్మ‌నే ఈ చిత్రాన్ని కూడా రూపొందించ‌నున్నాడు. స‌న్నీడియోల్, అమీషా పటేల్ సీక్వెల్లోనూ న‌టించ‌నున్నారు. కొత్త న‌టీన‌టులెవ‌రైనా యాడ్ అవుతారేమో తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వీళ్లిద్ద‌రితో గ‌దార్ సీక్వెల్ ఏమేర వ‌ర్క‌వుట్ అవుతుంద‌న్న‌దే సందేహంగా ఉంది.

2001 స‌మ‌యానికి అమీషా య‌వ్వ‌నంలో, క‌థానాయిక‌గా మంచి ఊపులో ఉంది. స‌న్నీడియోల్ కూడా ఫాంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ ఇద్ద‌రూ ఔట్ డేటెడ్ అయిపోయార‌నే చెప్పాలి. అమీషా దాదాపుగా సినిమాల‌కు దూరం అయిపోయింది. సన్నీ నామ‌మాత్రంగా కొన‌సాగుతున్నాడు. గ‌దార్ త‌ర్వాత‌ అనిల్ శ‌ర్మ అంచ‌నాలు అందుకోలేక‌పోయాడు. ఒక్క హిట్ మూవీ కూడా తీయ‌లేక‌పోయాడు. ఈ కాంబినేష‌న్లో, ఈ ప‌రిస్థితుల్లో గ‌దార్ సీక్వెల్ ఏమంత మంచి ఆలోచ‌న కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.