‘అఖండ’ టీంలో కరోనా టెన్షన్


ఇండియా అంతటా కరోనా వార్తలు బాగా తగ్గిపోయాయి. ముందు వేసిన అంచనాల ప్రకారం అక్టోబరులో థర్డ్ వేవ్ దేశాన్ని ఊపేస్తూ ఉండాలి. కానీ ఆ ప్రమాదం తప్పినట్లే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది తప్ప పెరగట్లేదు. అలాగని కరోనా కథ ముగిసిందని మాత్రం అనుకోలేం. ఓ మోస్తరుగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే ఈ మధ్య ప్రముఖులెవ్వరూ వైరస్ బారిన పడ్డట్లు వార్తలు రాలేదు. సినిమా ఈవెంట్లు చాలా మామూలుగా జరిగిపోతున్నాయి. సినిమాలు జోరుగా రిలీజవుతున్నాయి.

ఇలాంటి టైంలో ప్రముఖ కథానాయిక ప్రగ్యా జైశ్వాల్ కరోనా బారిన పడటం ఆమె నటిస్తున్న ‘అఖండ’ చిత్ర బృందాన్ని కంగారు పెట్టేసింది. తాను కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ప్రగ్యా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. “అంతగా రుచించని వార్తతో ఆదివారం ఉదయం నిద్ర లేచాను. రెండుసార్లు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ.. ఇప్పటికే ఓసారి కరోనా సోకినప్పటికీ.. మళ్లీ నేను కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాను. వైద్యుల సూచనలు పాటిస్తూ, జాగ్రత్త వహిస్తూ ఐసొలేట్ అయ్యాను. గత పది రోజుల్లో నాతో సన్నిహితంగా ఉన్న వాళ్లందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను” అని ప్రగ్యా తన పోస్టులో పేర్కొంది.

గత పది రోజుల్లో ప్రగ్యాతో సన్నిహితంగా ఉన్నది ‘అఖండ’ టీం సభ్యులే కాబట్టి వాళ్లకు ఆందోళన తప్పదు. గోవాలో కొన్ని రోజుల కిందటే ‘అఖండ’ చివరి షెడ్యూల్ ముగిసింది. ఆ తర్వాత చిత్ర బృందం ముగింపు వేడుకను కూడా చేసుకుంది. ఇందులో హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీళ్లందరూ ప్రగ్యాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా మీడియాలోకి వచ్చాయి. కాబట్టి అందరూ పరీక్షలు చేయించుకోక తప్పదు. వారిలో ఎవరైనా పాజిటివ్‌గా తేలతారేమో చూడాలి మరి.