కొండపొలానికి వెళ్లి క్రిష్ ఏం నేర్చుకున్నారు?

తెలుగు సినిమా దర్శకుల్లో క్రిష్ భిన్నమైన వ్యక్తి. తాను తీసే ప్రతి సినిమా కాస్త డిఫరెంట్ గా ఉండాలని నమ్మే దర్శకుల్లో ఆయన ఒకరు. క్రిష్ కథాంశాలు సగటు మనిషి తనను తాను ఐడెంటిఫై చేసుకునేలా ఉంటాయి. ఎంత కష్టమైన కథాంశం అయినా.. ఆసక్తికరంగా ఉండటమే కాదు.. అరటిపండు తోలు ఒలిచి చేతికి ఇచ్చినంత సింఫుల్ గా ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సమాజం పెద్దగా ఆలోచించని సాధారణ విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు.

తాజాగా ఆయన తీసిన మూవీ ‘కొండ పొలం’. హిట్ ఫ్లాపు అనే టాపిక్ ను పక్కన పెడితే అడవి.. గొర్రెలు.. వాటిని కాసే గొర్రెల కాపరుల జీవిత నేపథ్యంతో తీసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోందని చెప్పాలి. సినిమా విడుదల నేపథ్యంలో ఆయనో మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ వేళ.. దాదాపు రెండు వేల గొర్రెలతో పని చేసిన ఆయన.. గొర్రెల నుంచి ఏమైనా నేర్చుకున్నారా? అంటే.. గొర్రెల నుంచి కాదు కానీ.. గొర్రెల కాపరుల నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు.

ఏది ఈతకు వచ్చింది? దేనికి ముల్లు గుచ్చుకుంది? అనేది వాళ్లకు అవగాహన ఉంటుందని.. మన వృత్తిలో మనకెంత నైపుణ్యం ఉందో గొర్రెలు సాకడంలో వారికి అంత నైపుణ్యం ఉంటుంది. ఒక ఫిలిం మేకర్‌, పొలిటీషియన్‌లానే గొర్రెల కాపరి కష్టం ఎవరికంటే తక్కువ కాదు. అన్ని జీవులను వేసుకొని అడవిలో తిరగడం అంత సులభం కాదన్నారు. గొర్రెలు కాయడం చూసినంత తేలికైన విషయం కాదని, ఎంతో సునిశిత పరిశీలన అవసరమన్న విషయాన్ని క్రిష్ వివరించారు.