‘కొత్త’ వెర్సస్ ‘పాత’.. గెలిచేదెవరో?

వచ్చే వారం దసరా వస్తోంది. ఆ సందర్భంగా ఒకే వీకెండ్లో నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అంతకంటే ముందు ఈ వారాంతంలో రెండు కొత్త చిత్రాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. ఐతే ఇప్పుడు రిలీజవుతోంది కాబట్టి కొత్త సినిమా అనుకోవాలి కానీ.. నిజానికి ‘ఆరడుగుల బుల్లెట్’ను ‘పాత’ చిత్రంగానే చెప్పుకోవాలి. ఎప్పుడో ఏడెనిమిదేళ్ల ముందు మొదలైన సినిమా ఇది. రకరకాల కారణాల వల్ల మేకింగ్ ఆలస్యమైంది. సినిమా పూర్తయ్యాక రిలీజ్ మరింత లేటైంది.

ఇక ఎప్పటికీ రిలీజ్ కాదేమో అనుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతకుముందు ఒకసారి విడుదలకు అంతా సిద్ధం అయ్యాక రిలీజ్ రోజు ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఈసారి అలాంటి పరిస్థితి రాదనే ఆశిస్తున్నారు. మరి గోపీచంద్ హీరోగా సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్.. తన స్టయిల్లో తీసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఏమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

శుక్రవారం రిలీజవుతున్న మరో చిత్రం ‘కొండపొలం’. ఇది కచ్చితంగా ఒక ‘కొత్త’ ప్రయత్నం అనడంలో సందేహం లేదు. నవలా చిత్రాలు పూర్తిగా కనుమరుగైపోయిన ఈ రోజుల్లో సాహిత్య ప్రియుడైన దర్శకుడు క్రిష్.. రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాడు. దీని ప్రోమోలన్నీ చూస్తే ఇదొక భిన్నమైన ప్రయత్నం అన్నది స్పష్టంగా తెలుస్తోంది.

ఫారెస్ట్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓ కుర్రాడు.. కొన్ని ప్రయత్నాల్లో విఫలమై.. చివరగా ఇంకో ప్రయత్నం చేసి, అక్కడ అడవితో ముడిపడ్డ తన జీవితానుభవాలనే చెబుతూ ఇంటర్వ్యూలో ఎలా విజయవంతం అయ్యాడనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కథ చాలా వరకు అడవిలోనే నడుస్తుంది. ‘ఉప్పెన’ లాంటి విభిన్న చిత్రంతో హీరోగా పరిచయమై ఘనవిజయాన్నందుకున్న వైష్ణవ్ తేజ్, స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తుంది.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్నందుకుంటుంది అన్నది ఆసక్తికరం.