వైట్లను ఆదుకున్న ‘దూకుడు’

శ్రీను వైట్ల.. ఈ పేరును జనాలు మరిచిపోయి చాలా కాలం అయింది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా.. రూ.10 కోట్లకు పైగా పారితోషకం తీసుకున్న అరుదైన దర్శకుల్లో ఒకడిగా.. వైభవం చూపిన వైట్ల.. తనపై నెలకొన్న అంచనాలను అందుకోలేక.. వరుసగా డిజాస్టర్లు తీసి ఫేడవుట్ అయిపోయాడు. ‘దూకుడు’ సినిమాతో కెరీర్లో పీక్స్‌ను అందుకున్న వైట్ల.. ఆ సినిమా తర్వాతి నుంచి పతనమే చూశాడు.

‘బాద్షా’తో అంచనాలను అందుకోలేకపోయిన వైట్ల.. ఆ తర్వాత ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా వరుసగా దారుణమైన ఫెయిల్యూర్లు చూశాడు. దీంతో వైట్ల మీద అందరికీ నమ్మకం పోయింది. మిడ్ రేంజ్ హీరోలు కూడా అతణ్ని పట్టించుకోవడం మానేశారు. దాదాపు మూడేళ్లు అవకాశాలు లేక ఖాళీగా ఉండిపోయాడు వైట్ల. చివరికి హీరోగా వైట్లను మంచి స్ట్రగులవుతున్న మంచు విష్ణు ఆయనకు ఛాన్స్ ఇచ్చాడు.

సొంత నిర్మాణ సంస్థలో విష్ణు.. వైట్లతో ‘ఢీ అండ్ ఢీ’ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది అనౌన్స్ చేసినపుడు కూడా వైట్ల గురించి పెద్దగా చర్చ లేదు. కానీ ‘దూకుడు’ సినిమా రిలీజై పదేళ్లు పూర్తయిన సందర్భంగా వైట్ల పేరు మీడియాలో ప్రముఖంగా కనిపించింది. ఈ సందర్భాన్ని వైట్ల భలేగా ఉపయోగించుకున్నాడు. పెద్ద ఎత్తున మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్నటిదాకా వైట్ల ఇంటర్వ్యూ ఇస్తానన్నా తీసుకునే వాళ్లు లేరు. మీడియా ఎప్పుడూ సక్సెస్ ఫుల్ పీపుల్ చుట్టూనే తిరుగుతుందన్న సంగతి తెలిసిందే. అది అనివార్యం కూడా.

కానీ ‘దూకుడు’ పదో వార్షికోత్సవం నేపథ్యంలో వైట్లతో మీడియా వాళ్లు బాగానే ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారు. దీని ద్వారా పత్రికల్లో.. టీవీ ఛానెళ్లలో.. యూట్యూబ్ ఛానెళ్లలో.. వెబ్ సైట్లలో.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైట్ల కనిపిస్తున్నాడు రెండు రోజులుగా. ‘దూకుడు’ వార్షికోత్సవం తర్వాతి రోజే పుట్టిన రోజు కూడా రావడం కూడా వైట్లకు కలిసొచ్చింది. అతడికి మీడియాలో మంచి ప్రాధాన్యం దక్కింది. మరి మళ్లీ మీడియా దృష్టిలో పడ్డ వైట్ల.. ‘ఢీ అండ్ ఢీ’తో హిట్టు కొట్టి ఇలా తాత్కాలికంగా కాకుండా, మళ్లీ పూర్తి స్థాయిలో లైమ్ లైట్లోకి వస్తాడేమో చూడాలి.