ఏదో అనుకుంటే.. చివరికి ‘దూకుడు’ తయారైంది

రచయితలు ఎన్నో కథలు రాస్తుంటారు. దర్శకులు కూడా ఎన్నో కథలు వండుతుంటారు. వండిస్తుంటారు. అలాగే హీరోలు ఎన్నో కథలు వింటుంటారు. ఐతే చివరికి ఓకే అయి పట్టాలెక్కే కథలు కొన్నే ఉంటాయి. అలా ఎంపిక అయ్యే కథ ఏదన్నది అత్యంత కీలకం. ఏ దశలో ఎవరి ఛాయిస్ తేడా కొట్టినా.. అంతే సంగతులు. దాన్ని బట్టే సినిమా హిట్టో ఫట్టో నిర్ణయం అవుతుంది. మహేష్ బాబు కెరీర్లో అతి పెద్ద హిట్లలో ఒకటైన ‘దూకుడు’ సినిమా విషయానికి వస్తే.. ఆ సమయానికి మహేష్, శ్రీను వైట్ల చేయాల్సిన కథ ఇది కాదట. వీరి కలయికలో సినిమా అనుకున్నాక ముందు ఎంచుకున్న కథ వేరట.

2006లో విడుదలైన ‘రంగ్ దె బసంతి’ చూశాక మహేష్ కోసం దేశభక్తితో ముడిపడ్డ ఓ కథను అనుకున్నామని.. అది ఓకే అనుకుని దాని మీద దాదాపు ఐదు నెలల పాటు పని చేశామని.. 80 శాతం స్క్రిప్టు కూడా పూర్తి అయ్యాక.. ఆ కథ మీద సందేహాలు కలిగాయని.. దీంతో దాన్ని పక్కన పెట్టేశామని తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీను వైట్ల వెల్లడించాడు.

ఆ సమయంలో మహేష్‌ను ఎమ్మెల్యేగా చూపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి ‘దూకుడు’ కథ పుట్టిందని.. దాన్ని డెవలప్ చేసి.. పక్కాగా స్క్రిప్టు రెడీ చేసి సినిమాను పట్టాలెక్కించామని శ్రీను వైట్ల తెలిపాడు. ప్రకాష్ రాజ్ చేసిన పాత్రను మాజీ ఎమ్మెల్యే పి.జనార్ధనరెడ్డి స్ఫూర్తితో తీర్చిదిద్దామని.. ఈ పాత్రను శ్రీహరితో చేయించాలనుకున్నామని.. కానీ కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో ప్రకాష్ రాజ్‌తో చేయించామని శ్రీను తెలిపాడు.

ఇదిలా ఉండగా.. తన చివరి సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తర్వాత స్వతహాగానే కొంచెం గ్యాప్ వచ్చిందని, దీనికి తోడు కరోనా కారణంగా విరామం పెరిగిందని.. ఈ సమయంలో తన రైటింగ్ టీంతో కలిసి మూడు కథలు రెడీ చేశానని.. అవి మూడూ వినోద ప్రధానంగా సాగేవే అని.. అందులో ఒకటి ‘ఢీ అండ్ ఢీ’గా రాబోతోందని.. ఈ సినిమా ‘ఢీ’కి సీక్వెల్ కాదని.. కానీ ఆ చిత్రం మాదిరే పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని వైట్ల చెప్పాడు.