సంక్రాంతికి అక్కడా మెగా క్లాష్


సంక్రాంతి అనగానే ఇటు తెలుగులో, అటు తమిళంలో భారీ చిత్రాల మేళా పక్కా. ప్రతిసారీ ఈ రెండు సినీ పరిశ్రమల్లో బాక్సాఫీస్ దగ్గర మెగా క్లాష్‌లు చూస్తుంటాం. రాబోయే సంక్రాంతికి తెలుగులో ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో భారీ చిత్రాల హంగామా చూడబోతున్నాం. బాహుబలి‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’కు తోడు.. తెలుగులో టాప్ స్టార్లయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల చిత్రాలు భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ స్థాయి భారీ చిత్రాలు మూడు.. మూడు రోజుల వ్యవధిలో విడుదల కావడం ఇంతకుముందెన్నడూ జరగలేదు.

మరోవైపు తమిళంలో సైతం రాబోయే సంక్రాంతికి మెగా క్లాష్ ఖరారైంది. ప్రస్తుతం తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లయిన విజయ్, అజిత్ మధ్య బాక్సాఫీస్ పోరుకు సంక్రాంతి వేదిక కాబోతుండటం విశేషం.

ఇప్పటికే విజయ్ కొత్త చిత్రం ‘బీస్ట్’ సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అజిత్ సినిమా ‘వలిమై’ కూడా సంక్రాంతి రేసులోకి వచ్చేసింది. తమిళ సినిమా చరిత్రలోనే అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ఒకటిగా ‘వలిమై’ను చెప్పొచ్చు. ‘ఖాకి’ డైరెక్టర్ హెచ్.వినోద్ రూపొందించిన ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. సుదీర్ఘ కాలం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. ఇటీవలే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లింది.

ఏడాది నుంచి ‘వలిమై’ టీజర్ కోసం కాచుకుని ఉన్నారు అభిమానులు. దేశవిదేశాల్లో వివిధ ఈవెంట్లలో ‘వలిమై’ అప్‌డేట్ కోసం అజిత్ ఫ్యాన్స్ డిమాండ్లు చేయడం తెలిసిందే. వారి నిరీక్షణకు తెరదించుతూ గురువారం ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేస్తున్నారు. అంతకంటే ముందే ఈ సినిమా సంక్రాంతికి రిలీజవుతుందని నిర్మాత బోనీ కపూర్ ప్రకటించాడు. రజినీకాంత్ డౌన్ అయ్యాక కోలీవుడ్ నంబర్ వన్ స్థానం కోసం విజయ్, అజిత్‌ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య వైరం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ పోరును పతాక స్థాయికి తీసుకెళ్లేలా సంక్రాంతికి ఈ ఇద్దరి చిత్రాలు విడుదలవుతుండటంతో కోలీవుడ్ బాక్సాఫీస్‌లో రచ్చ ఖాయమన్నమాటే.