చరణ్ సినిమాలో స్పెషల్ ఎపిసోడ్.. పది కోట్లతో ట్రైన్ సెట్!

Charan Shankar

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నారనే ప్రశ్న చాలా కాలం అభిమానులను వెంటాడింది. ఫైనల్ గా దర్శకుడు శంకర్ తో సినిమా అనౌన్స్ చేయగానే.. ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోయారు. సౌతిండియన్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తగ్గట్లే ఈ సినిమాను భారీగా తెరకెక్కించడానికి ఫిక్స్ అయ్యారు. రాజకీయాలు, కోర్టుల చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ కలెక్టర్ పాత్రలో కనిపిస్తారట.

దీనికి ‘విశ్వంభర’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు టాక్. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో శంకర్ స్పెషల్ ట్రైన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారట. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయబోతున్నారని తెలుస్తోంది. సినిమాలో ఈ ఒక్క సన్నివేశం కోసం చాలా ఖర్చు పెట్టాలని, ఎక్కువ రోజులు షూట్ చేయాలని అనుకుంటున్నారట. ఇదొక భారీ యాక్షన్ ఎపిసోడ్. దీని కోసం వందల మంది ఫైటర్లు అవసరం ఉంటుందట.

ఈ సినిమా మొత్తానికి ట్రైన్ ఎపిసోడ్ మెయిన్ హైలైట్ గా నిలవబోతుందని చెబుతున్నారు. దీనికోసం స్పెషల్ గా సెట్ వేయాల్సిందేనట. ఈ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేయబోతున్నారని సమాచారం. మొత్తంగా ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్ లో తీయాలనుకుంటున్నారు. కానీ శంకర్ సినిమా బడ్జెట్ ను అంతకంతకు పెంచేసే అవకాశం ఉంది. నిర్మాత దిల్ రాజు దీనికి రెడీగానే ఉండి ఉంటారు. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, సునీల్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.