ప్రభాస్ మెగా మూవీ.. అస్త్రాలు సిద్ధం

ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత అన్నీ ‘పాన్ ఇండియా’ సినిమాలే చేస్తున్నాడు. ఐతే తన దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయేది ‘పాన్ వరల్డ్ మూవీ’ అంటూ ఊరిస్తున్నాడు నాగ్ అశ్విన్. ‘మహానటి’తో తనపై భారీగా అంచనాలు పెంచేసిన నాగ్ అశ్విన్.. ప్రభాస్ కోసం దాదాపు మూడేళ్లు ఎదురు చూసి మరీ ఈ సినిమాను పట్టాలెక్కించాడు. రెండు నెలల కిందటే ఈ సినిమా లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ మీద తొలి షెడ్యూల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ షెడ్యూల్లో ప్రభాస్ షూటింగ్‌లో పాల్గొనలేదు. హీరోయిన్ దీపికా పదుకొనే మాత్రం సెట్స్‌లోకి అడుగు పెట్టలేదు. తొలి షెడ్యూల్ చాలా తక్కువ రోజుల్లో షార్ట్‌గా ముగిసిపోయింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని తర్వాతి షెడ్యూల్‌కు సన్నాహాలు చేసుకుంటోంది చిత్ర బృందం.

తాజా సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. నవంబరులో తర్వాతి షెడ్యూల్లోకి వెళ్లనుందట. తొలి షెడ్యూల్‌లాగా ఇది నామమాత్రంగా ఉండట్లేదు. హీరో హీరోయిన్లు ప్రభాస్, దీపికా పదుకొనేలతో పాటు ముఖ్య తారాగణమంతా ఈ షెడ్యూల్లో షూటింగ్‌కు హాజరవుతుందట. ఈ సినిమా కోసం సెట్టింగ్స్ ద్వారా ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించిందట ఆర్ట్ డైరెక్టర్ టీం. ఆ ప్రపంచంలోకే కాస్ట్ అండ్ క్రూ అడుగు పెట్టబోతోంది.

రెండో షెడ్యూల్లో భారీ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని, సినిమా ఔట్ పుట్ ఎలా ఉండబోతోందన్నది ఈ షెడ్యూల్లోనే తెలిసిపోతుందని.. చిత్ర బృందానికి ఇదిలా చాలా ముఖ్యమైన షెడ్యూల్ అని అంటున్నారు. ఇంకో నెల రోజుల పాటు ప్రి ప్రొడక్షన్ పనులు చేసి, అస్త్ర శస్త్రాలతో నవంబరులో సెట్స్‌లోకి అడుగు పెట్టబోతోంది చిత్ర బృందం. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కబోతున్న చిత్రంగా దీన్ని చెబుతున్నారు. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.