ఆ హీరో చెడగొట్టుకుంటున్నాడే..


యువ కథానాయకుడు సందీప్ కిషన్ కెరీర్ చాలా ఏళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతను నిఖార్సయిన హిట్టు కొట్టి ఎన్నేళ్లయిందో కూడా లెక్కగట్టడం మానేశారు జనాలు. చాలా ఏళ్ల తర్వాత ‘నిను వీడని నీడను నేనే’ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. అది ప్రేక్షకులను పూర్తిగా మెప్పించిన సినిమా కాదు కానీ.. బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే ఎబోవ్ యావరేజ్‌గా ఆడింది.

ఆ తర్వాత వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ డిజాస్టర్‌గా నిలవగా.. ఈ ఏడాది రిలీజైన ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ కూడా ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. ఇప్పుడు సందీప్ నుంచి వచ్చిన ‘గల్లీ రౌడీ’కి అన్ని వైపులా విమర్శలు తప్పట్లేదు. పరమ రొటీన్ కథాకథనాలతో ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా సందీప్ కిషన్ అభిమానులకు ఈ సినిమా అస్సలు రుచించట్లేదు.

సందీప్ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా అతను ఏదో కొంచెం కొత్తగా ట్రై చేస్తుంటాడనే పేరుంది. అతడి సినిమాలు ఎంతో కొంత కొత్తగా ఉంటాయనే నమ్మకం ఉండేది. ఐతే జి.నాగేశ్వర రెడ్డి లాంటి రొటీన్ సినిమాలు చేసే, ఔట్ డేటెడ్ అయిపోయిన దర్శకుడితో అతను ఒకటికి రెండు సినిమాలు చేసి తన పేరును చెడగొట్టుకున్నాడు. ‘తెనాలి రామకృష్ణ’ డిజాస్టర్ అయినా సరే.. అతను మళ్లీ అతడితో సినిమా చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం.

తన స్టయిల్లో ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ చేసి కొంచెం పర్వాలేదనిపించిన సందీప్.. మళ్లీ ‘గల్లీ రౌడీ’తో రొటీన్ బాట పట్టాడు. ఈ చిత్రానికి తొలి రోజు ఓపెనింగ్స్ పర్వాలేదు కానీ.. తర్వాత అది నిలబడలేదు. బ్యాడ్ టాక్ సినిమాను బాగానే దెబ్బ కొట్టినట్లుంది. మొత్తానికి ‘గల్లీ రౌడీ’తో సందీప్ ఖాతాలో మరో ఫ్లాప్ జమ అయింది. ఇలాంటి సినిమాలు చేసి పేరు చెడగొట్టుకుంటే.. తర్వాత మంచి సినిమాలు చేసినా ప్రేక్షకుల్లో అంత ఆసక్తి ఉండదు. ఐతే తాజాగా అతను వీఐ ఆనంద్ లాంటి డిఫరెంట్ డైరెక్టర్‌తో జట్టు కడుతున్నాడు. ఈ సినిమాతో అయినా సందీప్ తన అభిమానుల అంచనాలను అందుకుని, మంచి విజయాన్నందుకుంటాడేమో చూాడాలి.