త్రివిక్రమ్ వచ్చాడు.. పరిపూర్ణం

ఈ తరం స్టార్ డైరెక్టర్లలో చాలామంది ప్రొడక్షన్ వైపు అడుగులు వేసిన వాళ్లే. కొందరు ప్రత్యక్షంగా నిర్మాతలుగా మారితే, ఇంకొందరు పరోక్ష ప్రొడ్యూసర్లయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి చాలా ఏళ్ల ముందు ‘అందాల రాక్షసి’తో నిర్మాతగా మారాడు. సుకుమార్ తన పేరు మీదే బేనర్ పెట్టి ‘కుమారి 21 ఎఫ్’ టైం నుంచే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కొరటాల శివ ఈ మధ్యనే సత్యదేవ్ హీరోగా ఒక చిత్రానికి సమర్పకుడిగా మారాడు.

పూరి జగన్నాథ్ వీళ్లందరికంటే ముందు, దర్శకుడిగా కెరీర్ ఆరంభంలోనే నిర్మాతగా మారి తన సినిమాలను తనే నిర్మించుకున్నాడు. మరో స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ సినిమాతో నిర్మాత అవతారం ఎత్తుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకరేమో ‘జవాన్’ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. ఇలా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో దాదాపు అందరూ ప్రొడక్షన్లో అడుగు పెట్టిన వాళ్లే కానీ.. త్రివిక్రమ్ ఒక్కడు అటు వైపు చూడలేదు ఇన్నాళ్లూ.

త్రివిక్రమ్.. తనకు అత్యంత సన్నిహితుడైన చినబాబు నిర్మాణంలోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు చాన్నాళ్లుగా. ఒక రకంగా త్రివిక్రమ్ వీటిలో నిర్మాణ భాగస్వామి అని, పారితోషకం కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటాడని, నిర్మాణ వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటాడని అంటారు. కానీ అధికారికంగా అయితే ఆయన నిర్మాతగా మారలేదు. సొంత బేనర్ పెట్టలేదు. నితిన్ హీరోగా వచ్చిన ‘ఛల్ మోహన్ రంగ’కు ఆయన నిర్మాతల్లో ఒకరని అన్నారు కానీ.. అది పేరుకే. ఆయన బేనర్ పేరైతే అందులో పడలేదు.

ఐతే ఇప్పుడు ఎట్టకేలకు ఆయన పూర్తి స్థాయిలో ప్రొడక్షన్లోకి అడుగు పెడుతున్నాడు. నవీన్ పొలిశెట్టి హీరోగా చినబాబు సెకండ్ బేనర్ అయిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’తో కలిసి ఆయన ఓ సినిమాను నిర్మించబోతున్న విషయం బయటికి వచ్చింది. ఫార్చ్యూన్ ఫర్ సినిమా పేరుతో త్రివిక్రమ్ బేనర్ మొదలుపెట్టారు. ఆయన భార్య సాయి సౌజన్య ఈ సినిమాతో నిర్మాతగా మారుతోంది. కళ్యాణ్ శంకర్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. మొత్తానికి త్రివిక్రమ్ కూడా ప్రొడక్షన్లోకి రావడంతో టాలీవుడ్లో దాదాపుగా టాప్ డైరెక్టర్లందరూ నిర్మాతలైపోయినట్లయింది.