పవన్‌ వచ్చేలోపు.. ఒకటి కాదు రెండు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో ఎంత స్పీడుమీదున్నాడో తెలిసిందే. ఆల్రెడీ ‘వకీల్ సాబ్’ సినిమాను రిలీజ్ చేసిన పవన్.. ప్రస్తుతం భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటితో పాటు ఇంకో రెండు సినిమాలను ఏడాది కిందటే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి హరీష్ శంకర్ మూవీ కాగా.. ఇంకోటి సురేందర్ రెడ్డి చిత్రం. వీటిలో హరీష్ సినిమా దసరాకు సెట్స్ మీదికి వెళ్తుందంటున్నారు.

సురేందర్ చిత్రం మాత్రం ఇప్పుడిప్పుడే మొదలయ్యేలా లేదు. కనీసం ఇంకో ఏడాదైనా టైం పట్టొచ్చని అంటున్నారు. ఈ ఆలస్యంపై ముందే అంచనా ఉండటంతో ఆల్రెడీ అక్కినేని అఖిల్‌తో ఏజెంట్ మూవీని లైన్లో పెట్టాడు సురేందర్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ ఏడాది చివర్లోపే ‘ఏజెంట్’ను పూర్తి చేయాలన్నది సురేందర్ ప్లాన్. ఐతే అది పూరయ్యాక కూడా చాలా రోజుల పాటు వేచి చూడక తప్పేలా లేదు.

దీంతో ఈ గ్యాప్‌లో ఇంకో సినిమాను కూడా సురేందర్ లాగించేయబోతున్నట్లుగా తాజాగా వార్తలొస్తున్నాయి. అతను యంగ్ హీరో నితిన్‌తో జట్టు కట్టబోతున్నట్లు సమాచారం. ఆల్రెడీ నితిన్.. వక్కంతం వంశీతో ఓ సినిమాను లైన్లో పెట్టాడు. అది పూర్తి చేశాక వక్కంతం కథతో సురేందర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడట. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్‌లోనే ఈ సినిమా తెరకెక్కనున్నట్లు కూడా తెలుస్తోంది.

ఇటీవలే నితిన్ సొంత బేనర్లో ‘మ్యాస్ట్రో’ మూవీ చేశాడు. అది ఈ నెల 17న హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమా నితిన్‌కు మంచి లాభాలే అందించింది. దీంతో ఆ ఉత్సాహంలో సొంత బేనర్లో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో మొదలుపెట్టి నాలుగైదు నెలల్లో పూర్తి చేసి.. ఆ తర్వాత సురేందర్ పవన్ సినిమా మీదికి వెళ్లిపోతాడు. పవన్-సురేందర్ చిత్రం 2023లో రిలీజయ్యే అవకశముంది.