ఆ హీరోయిన్ జీవితంలో అన్ని కష్టాలా?

ఐశ్వర్య రాజేష్.. సినిమాల్లో అడుగు పెట్టింది, ఒక స్థాయి అందుకుంది కోలీవుడ్లోనే అయినా.. ఈమె అచ్చమైన తెలుగమ్మాయి. నిన్నటి తరం నటుడు రాజేష్‌ తనయురాలే ఈ ఐశ్వర్య. ఐతే తండ్రి పేరున్న నటుడే అయినా సరే.. ఐశ్వర్య జీవితం పూల పాన్పు కాదు. ఐశ్వర్యకు ఎనిమిదేళ్ల వయసుండగానే రాజేష్ అనారోగ్యంతో చనిపోవడం పెద్ద విషాదం.

కుటుంబం కోసం రాజేష్ ఎలాంటి ఆస్తిపాస్తులూ మిగల్చలేదట. రాజేష్ సతీమణికి అసలు చదువే రాదట. ఇలాంటి సమయంలో కుటుంబ పోషణ అంతా ఆమెపై పడితే.. వీరి కుటుంబం ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, విషాదాల్ని తట్టుకుని నిలబడిందట. తాజాగా టెడెక్స్ వేదికగా ఐశ్వర్య తన జీవిత అనుభవాల్ని పంచుకుంది. అందులో ఆమె చెప్పిన విషయాలు తెలుసుకుంటే కన్నీళ్లు రాకమానవు.

తండ్రి మరణానంతరం తమ పరిస్థితి దిగువ మధ్య తరగతి స్థాయికి పడిపోయిందని.. ఆ సమయంలో తన తల్లి చీరలు తెచ్చి అమ్మి కొంత కాలం కుటుంబాన్ని పోషించిందని.. తర్వాత ఎల్ఐసీ ఏజెంట్‌గా మారిందని ఐశ్వర్య చెప్పింది. తన అన్నలు కాస్త పెద్ద వాళ్లయి కుటుంబ బాధ్యత తీసుకుంటున్న సమయంలో రెండేళ్ల వ్యవధిలో తమ కుటుంబంలో మరో రెండు విషాదాలు చోటు చేసుకున్నట్లు ఐశ్వర్య వెల్లడించింది.

తనకు 13 ఏళ్ల వయసుండగా.. తన పెద్దన్న చనిపోయాడని.. ఓ అమ్మాయిని ప్రేమించి గొడవ జరిగాక అతను చనిపోయాడని.. అతడి మరణం మిస్టరీగా ఉండిపోయిందని ఆమె తెలిపింది. ఇక తన రెండో అన్న హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివి ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడని.. 40 వేలు జీతమని.. ఇక తమ కష్టాలు తీరాయని అనుకుంటే అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఐశ్వర్య వెల్లడించింది.

ఇలా కొన్నేళ్ల వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయి తమ కుటుంబం కుంగిపోయిందని.. తర్వాత తాను ఇంటర్మీడియట్ చదువుతూనే పార్ట్ టైం ఉద్యోగం చేయడం మొదలుపెట్టానని.. తర్వాత టీవీ సీరియల్స్‌లో, ఆపై సినిమాల్లో చాలా కష్టపడి.. ఎన్నో అవమానాలు ఎదుర్కొని అవకాశాలు సంపాదించి.. చివరికి ఇప్పుడు నిలదొక్కుకున్నానని ఐశ్వర్య వెల్లడించింది.