దిల్ రాజు రీమేక్ మోజు

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు ఈ మధ్య రీమేక్ మోజు పట్టుకున్నట్లు ఉంది. ఈ మధ్యే ఆయన తమిళ క్లాసిక్‌ ‘96’ను పట్టుబట్టి రీమేక్ చేయించారు. ‘జాను’ పేరుతో తెరకెక్కిన ఆ చిత్రం తెలుగులో దారుణమైన ఫలితాన్నందుకుంది. అయినా రాజు వెనక్కి తగ్గట్లేదు.

తెలుగులో గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న ‘జెర్సీ’ రీమేక్ హక్కులు కొని.. హిందీలో కరణ్ జోహార్‌తో కలిసి అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఆ చిత్రానికి హిందీలోనూ గౌతమ్ తిన్ననూరినే రూపొందిస్తున్నాడు. మంచి ఎమోషన్ ఉన్న కథ, దేశవ్యాప్తంగా అందరికీ కనెక్టయ్యే క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో షాహిద్ నటించిన ‘కబీర్ సింగ్’ (అర్జున్ రెడ్డి రీమేక్) తరహాలోనే ఇది కూడా హిందీలో మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

మరోవైపు రాజు తన బేనర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఎఫ్-2’ను కూడా హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా ఆయన మరో తెలుగు సినిమాను హిందీలోకి తీసుకెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం. ఆ చిత్రం మరేదో కాదు.. హిట్. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా కొత్త దర్శకుడు శైలేష్ కొలను రూపొందించిన ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. అన్ సీజన్లో రావడం వల్ల వసూళ్లు మరీ ఎక్కువ రాలేదు కానీ.. సినిమా మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందింది. అమేజాన్ ప్రైంలో ఈ సినిమాను జనాలు బాగా చూశారు.

హిందీ అర్బన్ ఆడియన్స్‌కు బాగా కనెక్టయ్యే అవకాశమున్న ఈ థ్రిల్లర్ మూవీని హిందీలో మరింత పకడ్బందీగా తీస్తే మంచి ఫలితాన్నందుకునే అవకాశముంది. నాని నుంచి హక్కులు తీసుకున్న రాజు.. బాలీవుడ్లో కొత్తగా ఏర్పడిన పరిచయాల్ని అనుసరించి చర్చలు జరుపుతున్నాడని.. త్వరలోనే ఈ రీమేక్ గురించి కూడా ప్రకటన రావచ్చని అంటున్నారు.