అడివి శేష్ సినిమాకు ఇది దెబ్బే


క్షణం, గూఢచారి, ఎవరు లాంటి సినిమాలతో అడివి శేష్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో పెరిగిందో తెలిసిందే. వేరే భాషల వాళ్లూ అతడి సినిమాలు చూసి బాగా ఇంప్రెస్ అయిపోయారు. ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ శేష్‌కు ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే అతను ‘మేజర్’తో పాన్ ఇండియా లెవెల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో వీర మరణం పొంది హీరోగా అవతరించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ముంబయి దాడుల హీరో మీద సినిమా అంటే మామూలుగానే దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. పైగా శేష్ ఈ సినిమా చేస్తుండటంతో అంచనాలు ఇంకా పెరిగాయి. ఆ మధ్య రిలీజైన టీజర్ కూడా ఆసక్తిని పెంచేలాగే సాగింది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ చిత్రానికి ఇప్పుడో గట్టి దెబ్బ తగిలింది. అదే.. షేర్షా.

సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా దక్షిణాది దర్శకుడు విష్ణువర్ధన్ రూపొందించిన ‘షేర్షా’ గురువారమే అమేజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కార్గిల్ వార్ హీరో మేజర్ విక్రమ్ బత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

దీంతో ‘మేజర్’కు వచ్చిన సమస్య ఏంటి అంటే.. ఈ రెండు కథల్లో సారూప్యత కనిపిస్తుంది. ఇద్దరూ దేశం కోసం ప్రాణాలు విడిచిన సైనికులే. విక్రమ్ పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాదులతో పోరాడితే.. సందీప్ పాక్ ఉగ్రవాదులతో తలపడ్డాడు. దేశానికి ముప్పు వాటిల్లినపుడు ఇద్దరు సైనికులు ఏం చేశారన్నదే రెండు సినిమాల నేపథ్యం. వేర్వేరు ప్రాంతాల్లో నడిచిన కథలే అయినా.. దేశభక్తి ప్రధానంగా ఉండే ఎమోషన్ రెండింట్లోనూ ఒకటే. ఈ తరహా సినిమాల్లో ఒకటి మంచి అనుభూతిని ఇచ్చాక.. కొన్ని నెలల్లోనే ఇంకో సినిమా వస్తే కొంచెం ప్రేక్షకులకు మొనాటనస్‌గా అనిపిస్తుంది. ‘మేజర్’ కూడా ఇంతే బాగా ఉన్నప్పటికీ.. అప్పటికి ఇలాంటి ఓ సినిమా చూసిన ప్రేక్షకులు ఏమేర ఆసక్తిని ప్రదర్శిస్తారన్నది డౌట్. ముఖ్యంగా నార్త్ మార్కెట్లో ‘మేజర్’కు ఇది ఇబ్బంది కలిగించే విషయమే.