మ్యాస్ట్రో.. ఎందుకీ సైలెన్స్?


యూత్ స్టార్ నితిన్ నటించిన కొత్త చిత్రం ‘మ్యాస్ట్రో’. బాలీవుడ్ సూపర్ హిట్ ‘అంధాదున్’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాను రూపొందించాడు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’ ఈ చిత్రాన్ని నిర్మించింది. ముందు అనుకున్న ప్రకారం అయితే వేసవిలో థియేటర్లలోనే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రణాళికలు మారిపోయాయి.

ఈ చిత్రాన్ని హాట్ స్టార్ ఓటీటీ నుంచి మంచి ఆఫర్ రావడంతో డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిపోయారు. ఈ సంగతి రెండు నెలల ముందే ఖరారైంది. కానీ ఇప్పటిదాకా దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. డిజిటల్ రిలీజ్ దిశగా సంకేతాలు ఇస్తున్నారు. అప్పుడప్పుడూ ఒక పాట రిలీజ్ చేస్తూ ప్రమోషన్ కూడా చేస్తున్నారు కానీ.. తమ చిత్రంలో ఓటీటీలో విడుదల కానున్నట్లు కానీ, ఫలానా తేదీకి వస్తుందని కానీ చిత్ర బృందం అధికారికంగా ఏ ప్రకటనా చేయట్లేదు.

అలాగని ఓటీటీ రిలీజ్ గురించి ప్రచారాన్ని కూడా ఖండించట్లేదు. దాదాపు రూ.35 కోట్లకు ఈ సినిమాను హాట్ స్టార్ కొనుగోలు చేసిందని, నిర్మాతకు మంచి లాభమే వచ్చిందని అంటున్నారు. ఐతే రిలీజ్ విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని, ఓటీటీ రిలీజ్ గురించి ఎందుకు బయటపడట్లేదు అన్నదే అర్థం కావడం లేదు. ‘నారప్ప’ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. ఓటీటీ విడుదల గురించి మౌనం వహించారు. సడెన్‌గా వారం ముందు రిలీజ్ డేట్ ప్రకటించి హడావుడిగా రిలీజ్ చేశారు.

ఓటీటీల బాట పట్టడం పట్ల ఎగ్జిబిటర్లు.. నిర్మాతల మీద తీవ్ర ఆగ్రహంతో ఉండటం వల్ల ఈ విషయంలో వెనుకంజ వేస్తున్నారో ఏమో తెలియదు. అలాంటపుడు ‘నారప్ప’ను వదిలినట్లు ‘మ్యాస్ట్రో’ను కూడా సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేసి ఓ పనైపోయిందనిపించాలి. అలా కాకుండా నెలల తరబడి ఈ సైలెన్స్ ఏంటో? ఇంతకుముందు మీడియాలో ప్రచారం జరిగినట్లు ఆగస్టు 13న కూడా ఈ చిత్రం వచ్చేలా లేదు. మరి ఏ ముహూర్తాన్ని ఎంచుకున్నారో?