బోరున ఏడ్చాడు.. సూపర్ హిట్ కథ రాశాడు

Sujeeth

వయసు కేవలం 24 ఏళ్లు. ఏ దర్శకుడి దగ్గరా పని చేసిన అనుభవం లేదు. కేవలం షార్ట్ ఫిలిమ్స్ తీశాడంతే. ఈ అనుభవంతోనే అంత చిన్న వయసులో పేరున్న ప్రొడక్షన్ హౌస్‌లో సినిమా ఓకే చేసుకున్నాడు. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో తక్కువ బడ్జెట్లో సినిమా చేశాడు. అది సూపర్ హిట్టయి ఆ దర్శకుడికి మంచి పేరును.. నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. ఆ సినిమా పేరు.. రన్ రాజా రన్ కాగా, ఆ దర్శకుడు సుజీత్. ఈ సినిమాతో అతను టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత ఏకంగా ప్రభాస్‌తో ‘సాహో’ లాంటి భారీ చిత్రాన్ని తీశాడు. ఐతే ‘రన్ రాజా రన్’ లాంటి సూపర్ హిట్ సినిమా కథను అతను మూడే మూడు రోజుల్లో రాసేశాడట. అతను చాలా బాధలో ఉండి, ఏడుస్తున్న సమయంలో ఈ కథ తాలూకు ఐడియా వచ్చిందట. ఓ టీవీ ఇంటర్వ్యూలో అతను ఈ విషయాల్ని వెల్లడించాడు.

‘‘షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవంతో దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నించాను. అప్పుడో మంచి ప్రేమకథ రాసుకుని యువి క్రియేషన్స్ వాళ్లను కలిశా. వాళ్లకు ఫస్టాఫ్ నచ్చింది. సెకండాఫ్ మీద పని చేయమన్నారు. ఐదు నెలలు రాత్రింబవళ్లు ఆలోచించి సెకండాఫ్‌కి కూడా మంచి వర్షన్‌ రాశా. పూర్తి కథ వినిపిస్తే నిర్మాతలు చాలా బాగుందన్నారు. సంతోషంగా బండి తీసుకుని బయల్దేరా. ఫోన్ వస్తుంటే ఆపి మాట్లాడితే.. ఈ కథకు కథకు బడ్జెట్‌ ఎక్కువయ్యేట్లు ఉంది.. వేరే కథ ఉంటే చెప్పు అని నిర్మాతలు చెప్పారు. మైండ్ బ్లాంక్ అయిపోయింది. అప్పుడే వర్షం మొదలైంది.

అక్కడే రోడ్డు పక్కన కూర్చొని మూడు గంటల పాటు ఏడ్చాను. వెన్నెల కిషోర్‌కు ఫోన్‌ చేశాను. అతను కాస్త ధైర్యం ఇచ్చాడు. షార్ట్‌ ఫిల్మ్‌ స్టోరీ గంటలో రాయగలవు… సినిమా ఒక రోజులో రాయలేవా అన్నాడు. అప్పుడే నా బండిలో పెట్రోల్ అయిపోయింది. చేతిలో డబ్బుల్లేవు. అలాగే బండిని నెట్టుకుంటూ ముషీరాబాద్‌లోని ఇంటికి వెళ్లాను. అప్పుడే ‘రన్‌ రాజా రన్‌’ కథ ఫ్లాష్‌ అయ్యింది. తర్వాత మూడు రోజుల్లో ఆ కథను పూర్తి చేసి నిర్మాతల దగ్గరికి తీసుకెళ్లాను. ఒక్క డైలాగ్‌ కూడా మార్చకుండా ఓకే చేశారు’’ అని సుజీత్ వెల్లడించాడు.