మూడు సీక్వెల్స్‌కు స్క్రిప్టులు రెడీ

ద‌క్షిణాదిన 2000 త‌ర్వాత వ‌చ్చిన గొప్ప ద‌ర్శ‌కుల్లో గౌత‌మ్ మీన‌న్ ఒక‌డు. కాక్క కాక్క మొద‌లుకుని ఎన్నో క్లాసిక్స్ తీశాడ‌త‌ను. సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌ల్ని ఎంత హృద్యంగా తెర‌కెక్కిస్తాడో.. ఇంటెన్స్ పోలీస్ స్టోరీల్ని కూడా అంతే ప‌క‌డ్బందీగా రూపొందిస్తాడు గౌత‌మ్. కాక‌పోతే కొన్నేళ్లుగా అత‌డికి కాలం క‌లిసి రావ‌డం లేదు. నిర్మాత‌గా ఎదురైన న‌ష్టాలు, ఫైనాన్షియ‌ర్ల‌తో స‌మ‌స్య‌లు గౌత‌మ్ కెరీర్‌కు బ్రేకులేశాయి. అత‌డి సినిమాలు పూర్త‌యి కూడా విడుద‌ల‌కు నోచుకోని ప‌రిస్థితి త‌లెత్తింది. ఈ మ‌ధ్యే ధ‌నుష్‌తో తీసిన‌ ఎన్నై నొక్కి పాయుం తూటా చిత్రాన్ని రిలీజ్ చేయించ‌గ‌లిగాడు. కానీ అది ఆడ‌లేదు. విక్ర‌మ్‌తో తీసిన ధ్రువ‌న‌క్ష‌త్రం చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది.

ఆ సినిమా సంగ‌తేంటో తేల్చ‌కుండానే.. తాను మూడు కొత్త చిత్రాల‌కు స్క్రిప్టులు పూర్తి చేసిన‌ట్లు తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు గౌత‌మ్. ఆ మూడూ గౌత‌మ్ తీసిన క్లాసిక్స్‌కు సీక్వెల్సే కావ‌డం విశేషం. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో వేర్వేరుగా తెరకెక్కి రెండు చోట్లా చ‌క్క‌టి ఆద‌ర‌ణ పొందిన విన్నైతాండి వ‌రువాయ‌/ఏ మాయ‌ చేసావె చిత్రానికి గౌత‌మ్ సీక్వెల్ రెడీ చేశాడ‌ట‌. ఈ సినిమా చేయ‌డానికి తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావ‌డానికి శింబు రెడీగా ఉన్న‌ట్లు గౌత‌మ్ తెలిపాడు. మ‌రి మ‌న నాగ‌చైత‌న్య సంగ‌తేంటో తెలియ‌దు మ‌రి. మ‌రోవైపు క‌మ‌ల్ హాస‌న్‌తో తీసిన వేట్ట‌యాడు విలయాడు (రాఘ‌వ‌న్‌), అజిత్‌తో చేసిన ఎంత‌వాడుగానీ (ఎంత‌వాడుగానీ) సినిమాల‌కు కూడా సీక్వెల్ స్క్రిప్టులు రెడీ అయ్యార‌ని.. క‌మ‌ల్, అజిత్ ఓకే అంటే ఆ సినిమాలు చేస్తాన‌ని అన్నాడు గౌత‌మ్. ఐతే ఎంత ప్ర‌తిభ ఉన్నా.. గౌత‌మ్‌తో సినిమా అంటే ముందుకు క‌ద‌ల‌డం క‌ష్ట‌మ‌వుతున్న నేప‌థ్యంలో హీరోలు ఏమాత్రం ముందుకొస్తార‌న్న‌ది సందేహం.