ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ.. మొదలైందహో

ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ట్యాగ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. ముందుగా ‘బాహుబలి’తో అతనీ రికార్డును సొంతం చేసుకోగా.. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ చేతికి అది వెళ్లిపోయింది. ఐతే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ అంతకుమించిన బడ్జెట్లో తెరకెక్కుతున్నట్లు చెబుతున్నారు. ఐతే ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్న చిత్రం ఇండియాలో ఇప్పటిదాకా తెరకెక్కిన, తెరకెక్కనున్న సినిమాలన్నింటికంటే భారీ బడ్జెట్ మూవీగా చెబుతున్నారు. ఈ చిత్రం ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లింది. ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీని శనివారమే పట్టాలెక్కించారు.

ఐతే ప్రభాస్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ మొదలు కావడం విశేషం. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మీద తొలి సన్నివేశాలు తీస్తుండటం విశేషం. ఇందుకోసం ఆయన ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు కూడా. పెద్దగా హడావుడి లేకుండా ఈ సినిమాను మొదలు పెట్టేసింది నాగ్ అశ్విన్ టీం.

ప్రభాస్ ఇప్పటికే నటిస్తున్న సలార్, ఆదిపురుష్‌ల కంటే ముందు నాగ్ అశ్విన్ సినిమాను ప్రకటించారు. ఈ సినిమాను ప్రకటించి ఏడాది దాటిపోయింది. కానీ ప్రి ప్రొడక్షన్ పనులకే చాలా సమయం వెచ్చించాల్సి రావడం, ప్రభాస్ వేరే కమిట్మెంట్ల వల్ల ఈ చిత్రం ఆలస్యమైంది. ఒక దశలో పరిస్థితి చూస్తే ఈ ఏఢాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లదేమో అనిపించింది. కానీ ఎట్టకేలకు షూటింగ్ మొదలుపెట్టేశారు. దీంతో కలుపుకుంటే ప్రభాస్ సినిమాలు ఒకేసారి నాలుగు సెట్స్ మీద ఉన్నట్లన్నమాట.

అతను నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. ‘సలార్’ సగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆదిపురుష్ షూటింగ్ ఆరంభ దశలో ఉంది. ఒక సూపర్ స్టార్ సినిమాలు నాలుగు ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటుండటం విశేషమే. నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ చేయనున్న చిత్రంలో అతడి సరసన దీపికా పదుకొనే నటించనున్న సంగతి తెలిసిందే. ‘ఆదిత్య 369’ తరహాలో ఫాంటసీ టచ్ ఉన్న సైన్స్ ఫిక్షన్ మూవీగా దీన్ని చెబుతున్నారు.