శంకర్-చరణ్ సినిమాపై క్రేజీ రూమర్లు

Charan Shankar

తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయబోయే చిత్రం ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే నెలలోనే ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నట్లు చెబుతున్నారు. మూడు దశాబ్దాల కెరీర్లో ఎందరో తెలుగు స్టార్లు ప్రయత్నించినా ఎవరికీ చిక్కని శంకర్.. తొలిసారి చరణ్‌తో సినిమా చేస్తున్నాడు. దీనిపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో శంకర్ జోరు తగ్గినప్పటికీ.. ఆయన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సామాజిక అంశాలతో ముడిపడ్డ కథల్ని కమర్షియల్‌ స్టయిల్లో చెప్పి ప్రేక్షకులను ఉర్రూతలూగించడం శంకర్ శైలి. చరణ్ సినిమా కూడా అలాగే ఉంటుందని అంటున్నారు. ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే ఈ సినిమా గురించి కొన్ని క్రేజీ రూమర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి.

చరణ్‌తో శంకర్ చేయబోయే సినిమా ఆయన క్లాసిక్ మూవీ ‘ఒకేఒక్కడు’ తరహాలో ఉంటుందని ముందు నుంచి అంటున్నారు. ఇందులో చరణ్ ముందుగా ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తాడని.. ఆ తర్వాత అతను ముఖ్యమంత్రి అవుతాడని ఓ ప్రచారం నడుస్తోంది. మరోవైపేమో చరణ్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్నది తాజాగా వినిపిస్తున్న రూమర్.

ఒక పాత్ర లుక్ స్టన్నింగ్‌గా ఉంటుందని.. ఈ పాత్ర కోసం స్పెషల్ మేకప్ ట్రై చేయబోతున్నారని.. అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఈ పాత్ర, దాని లుక్, పెర్ఫామెన్స్ ఉంటాయని.. ప్రస్తుతం లుక్ టెస్ట్ కూడా చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం శంకర్ అయితే హైదరాబాద్‌లోనే తిష్ట వేసి చరణ్ సినిమా మీదే పూర్తిగా ఫోకస్ పెట్టిన మాట మాత్రం వాస్తవం. ఈ చిత్రానికి కథానాయికగా కియారా అద్వానీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తున్నారు.