నవరస టీజర్.. ఇది సెన్సేషనే

నవరస.. సోషల్ మీడియాలో ఇప్పుడీ పేరు చర్చనీయాంశం అవుతోంది. ఇది నెట్ ఫ్లిక్స్ కోసం దిగ్గజ దర్శకుడు మణిరత్నం నిర్మించిన ఆంథాలజీ ఫిలిం. ఇందులో తొమ్మిది కథలుంటే.. వాటిని ప్రియదర్శన్, గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖ దర్శకులు సహా తొమ్మిది మంది రూపొందించడం విశేషం. సూర్య, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి లాంటి మేటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శుక్రవారం ‘నవరస’ టీజర్ రిలీజ్ చేశారు. అది చూస్తే ‘నవరస’ రేంజ్ ఏంటో అర్థమవుతుంది.

సూర్య, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి, సిద్దార్థ్, యోగిబాబు, రేవతి, ఢిల్లీ గణేష్ లాంటి భారీ తారాగణాన్ని ఒక్కొక్కరిగా చూపిస్తూ వారితో వివిధ హావభావాలను పలికించారు. మొత్తం బ్లాక్ అండ్ వై‌ట్లో ఈ టీజర్ సాగడం విశేషం. బ్యాగ్రౌండ్ అంతా నలుపులో ఉండి.. నటీనటుల హావభావాలు మినహా ఇంకేమీ హైలైట్ కాకుండా చూశారు. నవరసాలను ఆర్టిస్టుల హావభావాల్లోనే చూపించారు. అందరిలోకి సూర్య బాగా హైలైట్ అయ్యాడు టీజర్లో. ఈ ఆంథాలజీ ఫిలింలో మొత్తం తొమ్మిది కథలు ఉంటాయి. బహుశా నవరసాల్లో ఒక్కో రసాన్ని ఒక్కో కథ ఎలివేట్ చేసేలా ఉండొచ్చు. మణిరత్నంతో పాటు 180, నా నువ్వే చిత్రాల దర్శకుడు, యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించాడు.

కరోనా కారణంగా దెబ్బ తిన్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మణిరత్నం ఈ చిత్రాన్ని గత ఏడాది ప్రకటించాడు. వీలైనంత ఎక్కువమందికి ఉపాధి కల్పించాడు. ‘నవరస’కు పని చేసిన నటీనటులు, టెక్నీషియన్లు పెద్దగా పారితోషకాలేమీ తీసుకోలేదని సమాచారం. ఈ తొమ్మిది కథల్లో ఒక్కోదాన్ని ప్రియదర్శన్, గౌతమ్ మీనన్, అరవింద్ స్వామి, కార్తీక్ సుబ్బరాజ్, కార్తీక్ నరేన్, బిజోయ్ నంబియార్, రతీంద్రన్ ప్రసాద్, సర్జున్, వసంత్ సాయి డైరెక్ట్ చేయడం విశేషం.ఎగ్జైటింగ్ కాస్ట్, టెక్నీషియన్లతో రాబోతున్న ఈ చిత్రం కచ్చితంగా సంచలనం సృష్టించే అవకాశముంది.