సురేష్ బాబు తగ్గేదే లేదు!

లాక్ డౌన్ కారణంగా మూతపడిన థియేటర్లను తిరిగి తెరిచేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. తెలంగాణలో వంద శాతం కెపాసిటీతో, ఏపీలో యాభై శాతం కెపాసిటీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు. కానీ బిజినెస్ పుంజుకోవడానికి మరింత సమయం పట్టేలా ఉంది. లాక్ డౌన్ సమయంలో నిర్మాతలకు ఓటీటీ బెస్ట్ ఆప్షన్ అయింది. అమెజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు భారీ మొత్తాలను ఆఫర్ చేయడంతో నిర్మాతలు కూడా ఓటీటీ రిలీజ్ లకు ఒప్పుకున్నారు.

దీంతో రీసెంట్ గా ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. పెద్ద సినిమాలను ఓటీటీలకు అమ్మొద్దని వారు రిక్వెస్ట్ చేశారు. మరి దగ్గుబాటి సురేష్ ఈ రిక్వెస్ట్ ను కన్సిడర్ చేస్తారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన నిర్మాత మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కూడా. ఇప్పటికే తను నిర్మించిన ‘దృశ్యం 2’ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించిన డీల్ కూడా క్లోజ్ అయింది.

అలానే వెంకటేష్ నటించిన మరో సినిమా ‘నారప్ప’ను కూడా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ డీల్ ఇంకా ఫైనల్ కాలేదు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘నారప్ప’ డీల్ ను ఆపేసి థియేటర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి సురేష్ బాబు ముందుకొస్తారా..? అనే విషయాన్ని ఆరా తీయగా.. ఆయన మాత్రం థియేటర్ రిలీజ్ కు సముఖంగా లేరని సమాచారం. ‘దృశ్యం 2’, ‘నారప్ప’ సినెమాలను ఓటీటీ వేదికల్లోనే విడుదల చేయాలని సురేష్ బాబు నిర్ణయించుకున్నారట. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు.