రాజ‌మౌళి స్టిల్ వ‌దిలాడో లేదో..

ఓప‌క్క రాజ‌మౌళి.. ఇంకో ప‌క్క జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌.. ఇలాంటి కాంబినేష‌న్లో తెర‌కెక్కిన సినిమా మీద అంచ‌నాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది? అందులోనూ బాహుబ‌లి లాంటి మెగా బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ కాంబినేష‌న్లో సినిమా కుద‌ర‌డంతో ఆర్ఆర్ఆర్‌పై అంచ‌నాలు ఆరంభంలోనే తార స్థాయికి చేరాయి. ఇక సినిమా మేకింగ్ సాగుతూ.. కొన్ని పోస్ట‌ర్లు, ప్రోమోలు వ‌దిలేస‌రికి ఆ అంచ‌నాలు ఇంకా పెరిగిపోయాయి.

ఈ సినిమా కోసం మొత్తంగా భార‌తీయ ప్రేక్ష‌కులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో తెలిసిందే. కాగా క‌రోనా సెకండ్ వేవ్ బ్రేక్ త‌ర్వాత షూటింగ్ పునఃప్రారంభించ‌డం.. బ్యాలెన్స్ టాకీ పార్ట్ పూర్తి చేసి.. ఇక రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలుంద‌ని అప్ డేట్ ఇవ్వ‌డంతో అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు.

ఐతే ఈ అప్‌డేట్‌తో పాటుగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. బుల్లెట్ మీద తార‌క్, చ‌ర‌ణ్ చాలా ఉత్సాహంగా దూసుకెళ్తున్న దృశ్యం క‌నువిందుగా ఉండ‌టంతో దీన్ని చ‌ర‌ణ్‌, తార‌క్ అభిమానులిద్ద‌రూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫొటో మీమ్ క్రియేట‌ర్ల‌కు కూడా మ‌హ బాగా ఉప‌యోగ‌ప‌డుతోంది. తార‌క్, చ‌ర‌ణ్‌ల త‌ల‌ల‌కు హెల్మెట్లు పెట్టేసి దీన్ని సైబ‌రాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌పై ప్ర‌చారానికి వాడుకున్న తీరు హైలైట్.

ఇక క్రికెట్ అభిమానులేమో తార‌క్, చ‌ర‌ణ్‌ల స్థానాల్లోకి కోహ్లి, రోహిత్‌ల‌ను తెచ్చి పెట్టేశారు. అలాగే స‌న్‌రైజ‌ర్స్ అభిమానులేమో డేవిడ్ వార్న‌ర్, కేన్ విలియ‌మ్స‌న్‌ల ఎడిట్‌లు చేసుకుని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొంద‌రు బాలీవుడ్ హీరోల అభిమానులు సైతం ఈ పోస్ట‌ర్‌ను వాడేసుకున్నారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ కొత్త పోస్ట‌ర్ జ‌నాల‌కు చాలా బాగా న‌చ్చేసి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.