ప్రశాంత్ నీల్.. తారక్ సినిమా గురించి చెప్పకనే చెప్పాడు

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాల విషయంలో జనాలకు ఓ సందిగ్ధత ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా ఎప్పుడో ఖరారైనప్పటికీ.. ‘ఆర్ఆర్ఆర్’ అవ్వగానే అది మొదలవుతుందా లేదా అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. దాని కంటే ముందు త్రివిక్రమ్.. విక్టరీ వెంకటేష్‌తో ఓ సినిమా చేస్తాడన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు తారక్‌తో కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తాడన్న చాన్నాళ్లుగా చర్చ నడుస్తోంది. బుధవారం తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు సినిమాల విషయంలో ఓ స్పష్టత వచ్చింది. తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ.. ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.

సితార మాతృ సంస్థ అయిన హారిక హాసిని బేనర్లో త్రివిక్రమ్ ఈ సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్‌కు 29వ సినిమా. ఎన్టీఆర్ 30 అని పేర్కొనడం ద్వారా తర్వాతి సినిమా త్రివిక్రమ్‌తోనే అని చెప్పకనే చెప్పాడు వంశీ. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ నీల్ సైతం తాను తారక్‌తో సినిమా చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పాడు. ఎన్నడూ లేని విధంగా అతను తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. ఒక న్యూక్లియర్ ప్లాంటు పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో తనకు అర్థమైందని.. ఇంకరోసారి అతణ్ని కలిసినపుడు తాను రేడియేషన్ సూట్ తొడుక్కుని వెళ్తానని అంటూ.. తారక్‌కు శుభాకాంక్షలు చెప్పి, త్వరలోనే తారక్‌ను కలుస్తానని చెప్పాడు ప్రశాంత్. అతను తారక్‌కు శుభాకాంక్షలు చెప్పడంతోనే త్వరలోనే అతడితో కలిసి చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పినట్లు అయింది. మైత్రీ మూవీ మేకర్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.