ఆరడుగుల బుల్లెట్.. మళ్లీ లైన్లోకి

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ఎప్పుడో ఏడేళ్ల కిందట భూపతి రాజా అనే తమిళ దర్శకుడితో ఓ సినిమాను మొదలుపెట్టారు. ఐతే షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే ఏవో సమస్యలు తలెత్తి.. భూపతి రాజా ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. సీనియర్ దర్శకుడు గోపాల్ ఈ చిత్రాన్ని టేకప్ చేశారు. ఆయనే సినిమాను పూర్తి చేశారు. నయనతార ఇందులో కథానాయిక.

సినిమా నిర్మాణం పూర్తి కావడానికే కొన్నేళ్లు పట్టగా.. అది పూర్తయ్యాక ఏవో సమస్యలు తలెత్తి విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. మూడేళ్ల కిందట ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి గట్టి ప్రయత్నమే జరిగింది. రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. ఇక సినిమా విడుదల కావడం లాంఛనమే అనుకుంటున్న సమయంలో మళ్లీ బ్రేక్ పడింది. రిలీజ్ రోజు ఉదయం ఫైనాన్షియర్లు అడ్డు పడటంతో సినిమా థియేటర్లకు రాకుండా ఆగిపోయింది. ఆ తర్వాత దీని గురించి ఊసే లేదు.

ఐతే గత ఏడాది నుంచి ఓటీటీల హవా నడుస్తుండటంతో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నేరుగా డిజిటల్ రిలీజ్‌కు ఈ సినిమాను సిద్ధం చేసే అవకాశాలున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అది కూడా కార్యరూపం దాల్చలేదు. కాగా ఇప్పుడు ఉన్నట్లుండి ‘ఆరడుగుల బుల్లెట్’ వార్తల్లోకి వచ్చింది. దీని నిర్మాత రమేష్.. ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. తమ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన నేపథ్యంలో మళ్లీ థియేటర్లు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్లలోకే వస్తుందని స్పష్టం చేశారు.

ఐతే ఎప్పుడో ఏడేళ్ల కిందట మొదలైన సినిమాను ఇప్పుడు చూస్తే అందులో పాత వాసనలు గుప్పుమనడం ఖాయం. గోపీచంద్, నయనతార లుక్స్ కూడా పాతగా అనిపించొచ్చు. మరి ఇలాంటి సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అన్నింటికీ మించి అసలు ఈసారైనా పక్కాగా ‘ఆరడుగుల బుల్లెట్’ రిలీజవుతుందో లేదో చూడాలి.