వామ్మో.. రాజు గారి గది-4 అట

బుల్లితెరపై ‘ఆట’, ‘మాయాద్వీపం’ లాంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఆ తర్వాత దర్శకుడిగా అరంగేట్రం చేసిన వ్యక్తి ఓంకార్. టీవీ షోల్లో అతను చేసే అతి కొంతమందికి చికాకు తెప్పించినప్పటికీ.. టార్గెటెడ్ ఆడియన్స్‌ను అయితే అతను మెప్పించగలిగాడు. ఆ షోలను విజయవంతం చేయగలిగాడు.

అక్కడ్నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసంతోనే దర్శకుడిగా మారి ‘జీనియస్’ అనే సినిమా చేశాడు. కానీ అది తుస్సుమంది. ఐతే అంతటితో అతడి సినీ ప్రయాణం ఆగిపోతుందనుకున్నాంతా. కానీ హార్రర్ కామెడీ జానర్లో అతను చేసిన ‘రాజు గారి గది’ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ మంచి విజయాన్నందుకుంది. అందులో కథాకథనాలన్నీ పాతవే అయినప్పటికీ.. కామెడీ వర్కవుట్ కావడంతో ఆ టైంకి అది మంచి ఫలితాన్నందుకుంది. కానీ ఒక సినిమా హిట్టయింది కదా అని అదే ఫార్ములాలో మళ్లీ మళ్లీ సినిమాలు తీసి బోల్తా కొట్టాడు ఓంకార్.

మంచి అంచనాల మధ్య వచ్చిన ‘రాజు గారి గది-2’తో పాటు ‘రాజు గారి గది-3’ కూడా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఇవి ఓంకార్ సొంత కథలతో చేసిన సినిమాలు కావు. మలయాళం, తమిళంలో హిట్టయిన సినిమాల కథలను పట్టుకొచ్చి ‘రాజు గారి గది’ గొడుగు కింద పెట్టేశాడు. అయినా ఫలితం లేకపోయింది. ‘రాజు గారి గది-3’ చూశాక ఈ అతి కామెడీ చాలు బాబోయ్ అనేశారు జనాలు.

అయినా సరే.. ఓంకార్‌ ఏమీ వెనక్కి తగ్గట్లేదు. జనాలకు మొహం మొత్తిన ఫార్ములాలోనే ఇంకో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. తన నుంచి ‘రాజు గారి గది-4’ మూవీ రాబోతున్నట్లు తాజాగా అతను ప్రకటించాడు. ఈ సినిమాకు కథ ఎప్పుడో రెడీ అయిందని, కరోనా వల్ల షూటింగ్ మొదలు కాలేదని.. త్వరలోనే సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తానని ప్రకటించాడు. ఇది కాక ఒక స్పోర్ట్స్ డ్రామా, రూరల్ డ్రామా నేపథ్యంలో కథలు రెడీ చేశానని.. వీలును బట్టి ఆ సినిమాలను తెరకెక్కిస్తానని చెప్పాడు. ఐతే వేరే సినిమాల సంగతేమో కానీ.. రాజుగారి గది సిరీస్‌లో నాలుగో సినిమా అనేసరికే జనాలు బెంబేలెత్తిపోతున్నారు.